‘భారత్‌ ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది’

31 May, 2018 15:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో భారత్‌ ప్రపంచ శక్తిగా ఎదుగుతోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ‘మోదీ సర్కార్‌ నాలుగేళ్ల పాలన’ పై  హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ..భారత్‌ మాట కోసం ప్రపంచం ఎదురుచూసేలా మోదీ దేశ గౌరవాన్ని పెంచారన్నారు.

రష్యా, చైనా దేశాలు ప్రధాని మోదీని స్వయంగా ఆహ్వానించాయని రవిశంకర్‌ ప్రసాద్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాలుగేళ్ల నుంచి దేశ ఆర్థికస్థితి స్థిరంగా, వేగంగా పెరుగుతోందన్నారు. రెండులక్షల కిలోమీటర్లకు పైగా ఆప్టికల్‌ ఫైబర్‌ నాలుగేళ్లలో వెయ్యగలిగామని పేర్కొన్నారు. 120 కంపెనీలు స్వదేశంలోనే మొబైల్స్‌ తయారు చేస్తున్నాయని,  గ్రామీణ, పట్టణ రహదారులు వేగంగా నిర్మించామని తెలిపారు.

50కోట్ల మందికి 5లక్షల ఇన్సూరెన్స్‌ ఇస్తున్నామన్నారు. ఆధార్‌ వాడకంలో ప్రైవసీ, సెక్యూరిటీని పెంచామని, సర్టికల్‌ స్ట్రైక్‌ లాంటి గట్టి నిర్ణయాలు మోదీ సర్కార్‌ తీసుకుందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాద విషయంలో పాకిస్తాన్‌ను ప్రపంచంలో ఒంటరి చేశామని రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. డిజిటల్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా ఇలా ప్రతి పథకం ప్రజల కోసమే అమలు చేశామన్నారు. దేశంలో అందరికి జన్‌ధన్‌ ఖాతా తెరిపించి డిజిటల్‌ పరిపాలన పెంచామని ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు