తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమాను కష్టాలు వీడటం లేదు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించారన్న కారణంగా ఆమెను ముస్లిం సమాజం నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వివిధ వర్గాల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో రెహానాను బదిలీ చేస్తూ బీఎస్ఎన్ఎల్ యాజమాన్యం.. పలవరివట్టం అనే ప్రాంతానికి ఆమెను బదిలీ చేసింది. అయితే అక్కడ కూడా ఆమె పని చేయడానికి వీల్లేదని, ఉద్యోగం నుంచి తొలగించాలంటూ శబరిమల కర్మ సమితి సభ్యులు మంగళవారం నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో.. ఇలాంటి బెదిరింపులకు రెహానా భయపడే రకం కాదని, ఎవరి కారణంగానో తన ఉద్యోగాన్ని వదులుకోరని ఆమె సన్నిహితులు వ్యాఖ్యానించారు.
కాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్లో రెహానా ఫాతిమా కస్టమర్ రిలేషన్ విభాగంలో టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. శబరిమల ఆలయంలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన కారణంగా ఆమెను బోట్ జెట్టీ ప్రాంతం నుంచి పబ్లిక్ కాంటాక్ట్ అంతగా అవసరం లేని పలరివట్టం ఎక్ఛ్సేంజీకి బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.