ముంబై : కరోనా వైరస్ పై ప్రబలుతున్న అసత్య ప్రచారాలు, వదంతులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సింది పోయి బాధ్యతా రహితంగా వ్యవహరించారు ఓ ప్రజాప్రతినిధి. కరోనా పాజిటివ్ రోగులకు, అనుమానితులకు చికిత్స అందించేందుకు తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని తరలించాలంటూ ఓ ఎమ్మెల్యే ఆందోళన చేశారు. క్వారంటైన్ సెంటర్ కారణంగా తమకు కూడా కరోనా సోకుతుందేమోనని ప్రజలు భయపడుతున్నారని అన్నారు. వెంటనే తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని మరో ప్రాంతానికి తరలించాలంటూ సదరు ఎమ్మెల్యే కలెక్టరేట్ ఆవరణలో ధర్నా చేపట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
కాగా కరోనా నేపథ్యంలో నాగ్పూర్ హిగ్నా ప్రాంతంలోని వనదొంగ్రీలో ఉన్న బాబాసాహెబ్ బాలుర హాస్టల్లో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సమీర్ మెఘే ఆందోళన చేపట్టారు. తమ ప్రాంతంలో జనసాంద్రత అత్యధికంగా ఉందని క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల తమకు కూడా కరోనా సోకే అవకాశం ఉందని ఆరోపించారు. అందుకే క్వారంటైన్ కేంద్రాన్ని మరోచోటుకు తరలించాలని డిమాండ్ చేశారు.