వీటిలో ఏ ఒక్కటి లేకున్నా అది దొంగనోటే..

30 Jul, 2019 12:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నకిలీ నోట్ల చలామణీ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోన్న సంగతి తెలిసిందే. వీటిని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అత్యున్నత ప్రమాణాల్లో కరెన్సీని ముద్రిస్తోంది. అయినప్పటికీ దొంగ నోట్లు మార్కెట్‌లో చలామణీ అవుతూనే ఉన్నాయి. మార్కెట్‌లో విచ్చలవిడిగా దొంగనోట్లు చెలామణీ అవుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే దొంగనోట్లను నివారించడానికి ఆర్‌బీఐ 2016లోనే పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులోని 17 అంశాలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా అది దొంగనోటేననే నిర్ధారణకు రావొచ్చు. ఆర్‌బీఐ ప్రకారం నోట్లలోని ప్రధాన గుర్తులను తెలుసుకుంటే ఏది అసలు.. ఏది నకిలీ అని తేలిపోతుంది. రూ.2000, రూ.500, రూ.200, రూ.100 కరరెస్సీ నోట్లలో గుర్తించాల్సిన అంశాలను పరిశీలిస్తే..

రూ.2వేలు  నోటు ముందు 
1. లైటు వెలుతురులో రూ.2000 అంకెను గమనించవచ్చు.
2. 45 డిగ్రీల కోణంలో చూస్తే రూ.2000 అంకెను గమనించొచ్చు.
3. దేవనాగరి లిపిలో రూ.2000 సంఖ్య ఉంటుంది
4. మధ్య భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ ఉంటుంది
5. చిన్న అక్షరాల్లో ఆర్బీఐ, 2000 అని ఉంటుంది
6. నోటును కొంచెం వంచితే విండోడ్‌ సెక్యూరిటీ త్రెడ్‌ ఆకుపచ్చ నుంచి నీలానికి మారుతుంది. మధ్యలో భారత్, ఆర్బీఐ, రూ.2000 అంకె ఉంటుంది.
7. గవర్నర్‌ సంతకం, ఆర్బీఐ చిహ్నం కుడివైపునకు మార్పు 
8. మహాత్మాగాంధీ బొమ్మ, ఎలక్ట్రోటైప్‌ (2000)    వాటర్‌ మార్క్‌ ఉంటుంది
9. పైభాగంలో ఎడమ వైపున, కింది భాగంలో కుడివైపున సంఖ్యలతో కూడిన నంబర్‌ సైజ్‌ ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది.
10. కుడి వైపున కింది భాగంలో రంగు మారే ఇంక్‌ (ఆకుపచ్చ నుంచి నీలం)లో రూపాయి సింబల్‌తో పాటు 2000 సంఖ్య ఉంటుంది
11. కుడివైపున అశోక స్తూపం చిహ్నం ఉంటుంది. అంధుల కోసం..మహాత్మాగాంధీ బొమ్మ, అశోక స్తూపం చిహ్నం, బ్లీడ్‌ లైన్స్, గుర్తింపు చిహ్నం చెక్కినట్లుగా లేదా ఉబ్బెత్తుగా ఉంటాయి.
12. కుడి వైపున దీర్ఘ చతురస్రాకారంలో ఉబ్బెత్తుగా 2000 అని ముద్రించి ఉంటుంది.
13. కుడి,ఎడమ వైపున ఉబ్బెత్తుగా ముద్రించిన ఏడు బ్లీడ్‌ లైన్స్‌ ఉంటాయి.

వెనుక వైపు
14. నోటు ముద్రణ సంవత్సరం ఎడమవైపున ఉంటుంది.
15. నినాదంతో సహా స్వచ్ఛభారత్‌ లోగో ఉంటుంది
16. మధ్య భాగంలో భాషల ప్యానల్‌ ఉంటుంది
17. మంగళయాన్‌ చిత్రం ఉంటుంది.

మరిన్ని వార్తలు