డ్రగ్స్ వాడకంతో అనర్థాలపై అవగాహన

15 Jun, 2014 23:01 IST|Sakshi
డ్రగ్స్ వాడకంతో అనర్థాలపై అవగాహన

సాక్షి, ముంబై: ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక (ఏఎన్‌సీ) దినాన్ని పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీ నుంచి నగర పోలీసులు యాంటీ డ్రగ్ డ్రైవ్‌ను ప్రారంభించనున్నారు. వారం రోజుల పాటు నిర్వహించనున్న ఈ డ్రైవ్‌లో దాదాపు 3.5 లక్షల మందికి అవగాహన కల్పించేందుకు పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. మత్తు పదార్థాలను సేవించడం ద్వారా కలిగే అనర్థాలపై నగర వాసుల్లో అవగాహన కల్పించనున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (మాదక ద్రవ్యాల వ్యతిరేక విభాగం) కిషోర్ జాదవ్ తెలిపారు.  సీనియర్ ఇన్‌స్పెక్టర్లు తమ పరిధిలోని కాలేజీల్లో మాదక ద్రవ్యాల వ్యతిరేక దిన ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
 
అంతేకాకుండా మొహల్లా కమి టీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. బీట్ మార్షల్స్ కూడా మత్తుపదార్థాలు సేవించడం ద్వారా కలిగే నష్టాల గురించి నగర వాసులకు వివరించనున్నారు. ఏఎన్ సీ సైతం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రెజెంటేషన్‌లో మత్తుపదార్థాలకు అలవాటు పడిన విద్యార్థుల జీవితాలు ఎలా అర్ధాంతరంగా ముగిస్తున్నాయో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. మత్తుపదార్థాలను సేవిం చడం ద్వారా కలిగే అనర్థాలు, మత్తుపదార్థాలకు అలవాటుపడిన వారి లక్షణాలు, అదేవిధంగా వీటికి అలవాటుపడిన వారిని తిరిగి మామూలు మనిషిగా చేసేందుకు తీసుకుంటున్న చర్యల గురించి వివరిం చనున్నారని జాదవ్ తెలిపారు.

వివిధ ప్రాం తాల్లో సామాజిక సంస్థల సహాయంతో వీధి నాట కాలు కూడా ప్రదర్శించనున్నామన్నారు. రైల్వేస్టేషన్లలో కూడా అవగాహన కల్పించేందుకు ఏఎన్‌సీ నిర్ణయించింది. ఇదిలా వుండగా, నగరవ్యాప్తంగా ఫిబ్రవరి మధ్యలో మార్చి మొదటి వారంలో యాం టీ డ్రగ్ డ్రైవ్‌ను ప్రారంభించగా 1400 మందికి పైగా పట్టబడ్డారు. వీరిలో మత్తుపదార్థాలు సేవిం చినవారే కాకుండా విక్రయించే వారుకూడా ఉన్నారని అధికారి తెలిపారు. 

మరిన్ని వార్తలు