పెరుగుపై జీఎస్టీ; రూ. 15 వేల జరిమానా!

18 Jul, 2019 17:13 IST|Sakshi

చెన్నై : జీఎస్టీ పరిధిలో లేని వస్తువులపై కూడా పన్ను వసూలు చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. రాష్ట్రంలో తిరునల్వేలిలోని ఒక హోటల్‌లో ఓ వ్యక్తి రూ.40 పెరుగును కొన్నాడు. పెరుగు మీద కూడా హోటల్‌ సిబ్బంది జీఎస్టీ పన్ను విధించడంతో ఆ వ్యక్తి కంగుతిన్నాడు. జీఎస్టీ పన్ను కింద రూ. 2, ప్యాకింగ్‌ కవర్‌కి రూ. 2 లు చెల్లించాలని చెప్పడంతో బిత్తరపోయాడు. పెరుగుపైన కూడా జీఎస్టీ ఎలా వసూలు చేస్తారని అడిగాడు. దానికి హోటల్‌ సిబ్బంది ఇంకా పెరుగుపై తమ కంప్యూటర్‌ బిల్లింగ్‌ వ్యవస్థలో జీఎస్టీ పన్ను చూపిస్తోందన్నారు. కావున మీరు పన్నుతో కూడిన ధరను చెల్లించాలన్నారు.

ఈ క్రమంలో అతను జీఎస్టీ అధికారులను సంప్రదించినా వారు కూడా దీనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. దీంతో ఆ వ్యక్తి వినియోగదారుల ఫోరమ్‌లో​ ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వాదనలు విన్న వినియోగదారుల ఫోరమ్‌ సదరు వ్యక్తికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అదే విధంగా హోటల్‌ యాజమాన్యంపై రూ.15000 జరిమానా విధించింది. ఒకవేళ నెల రోజుల లోపు జరిమానా చెల్లించని క్రమంలో ఆ మొత్తానికి వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది.

మరిన్ని వార్తలు