షీనాబోరా హత్యకు కారణాలివే..!

21 Nov, 2015 12:15 IST|Sakshi
షీనాబోరా హత్యకు కారణాలివే..!

ముంబై:  సస్పెన్స్  క్రైమ్ థిల్లర్ లా సాగిపోతున్న షీనాబోరా హత్య కేసులో సీబీఐ  విచారణ  ఒక కొలిక్కి వచ్చినట్టు  కనిపిస్తోంది.  ఆర్థిక కారణాలు, రాహుల్ ముఖర్జియాతో సంబంధం, ఇంద్రాణిని బ్లాక్‌మెయిల్ చేయడం లాంటివే  షీనాబోరా హత్యకు ప్రధాన కారణాలని సీబీఐ తన చార్జిషీటులో పేర్కొన్నది.   కోట్ల రూపాయల   ఆర్థిక వివాదాలే షీనాబోరా హత్యకు కారణాలని పేర్కొంది.  ముఖ్యంగా  1300 కోట్ల  రూపాయల లావాదేవీలు ఇందులో ప్రధానమని తెలిపింది. తల్లీ కూతుళ్ల మధ్య నెలకొన్ని వివాదాలే  ఇంద్రాణిని షీనా హత్యకు  పురికొల్పాయని సీబీఐ తేల్చింది.

ఈ కేసులో షీనా  తల్లి ఇంద్రాణిని ప్రధాన నిందితురాలిగా పేర్కొన్న సీబీఐ, ఇప్పటికే  మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు  డ్రైవర్ శ్యామ్ రాయ్ ను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుత భర్త, మీడియా టై్కూన్ పీటర్ ముఖర్జియాను  నాలుగో ముద్దాయిగా  చేర్చింది.  ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా, పీటర్ ముఖర్జియా  కేవలం ఆస్తి, డబ్బు కోసమే ఓ పథక ప్రకారం షీనాను హత్య చేసినట్టు తెలుస్తోంది.  ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించాలని చూశారు.  షీనాను అంతం చేస్తే ఆస్తి అంతా తన రెండో కూతురు  నిధికే దక్కుతుందనేది సంజీవ్ పథకం.   రాహుల్ ముఖర్జీ,  షీనాల పెళ్లి జరిగితే ఆస్తి అంతా అతను ఎగరేసుకుపోతాడనే భయంతో పీటర్ ముఖర్జీయా ఈ కుట్రలో భాగం పంచుకున్నాడు. ఇక  మొదటినుంచి తల్లీ  కూతుళ్ల మధ్య తగాదాలు ఉన్నాయి. ప్రధానంగా రాహుల్  ముఖర్జీతో ప్రేమ వ్యవహారం ఇంద్రాణికి నచ్చలేదు.  పైగా షీనాపై ఉన్న ఆస్తులు తిరిగి తనకు దక్కవేమోనన్న భయం ఆమెను పట్టుకుంది. ఈ నేపథ్యంలో 2004 లో షీనాకు  బహుమతిగా ఇచ్చిన ఏడు బెడ్‌రూంల ఫ్లాట్‌ను 2010లో  ఆమెకు తెలియకుండానే ఇంద్రాణి విక్రయించింది.  దీంతో  వివాదం మరింత రగిలింది. తామిద్దరం  ప్రపంచానికి తెలిసినట్టుగా అక్కాచెల్లెళ్లం కాదు, తల్లీకూతుళ్లమనే విషయాన్ని బయటపెడతానని  షీనా బ్లాక్‌మెయిల్‌కు దిగింది.   ఈ క్రమంలో షీనా హత్యకు పథకం వేశారని సీబీఐ పేర్కొంది. 'షీనా జాగ్రత్తగా ఉండు' అంటూ  ఇంద్రాణి, సంజీవ్ ఖన్నాల  రెండవ కూతురు విధి..  సోదరి షీనాకు ఒక ఎస్సెమ్మెస్ చేసినట్టు కోర్టుకు సీబీఐ వెల్లడించింది. తల్లి ఇంద్రాణి పథకాన్ని పసిగట్టిన విధి షీనాను ముందుగానే హెచ్చరించిందని సీబీఐ పేర్కొంది.

2012, ఏప్రిల్ 24న ఇంద్రాణి ఆమె మాజీ భర్త సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ కలిసి షీనా బోరాను  హత్య చేసి మారుమూల అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల తర్వాత వెలుగుచూసిన ఈ హత్య కేసు అనేక మలుపులు తిరుగుతూ  సీబీఐకి  సవాల్‌గా మారింది.
 

మరిన్ని వార్తలు