వర్షం రూపంలో అదృష్టం: రిక్షావాలకు 50 లక్షల లాటరీ

2 Oct, 2019 14:33 IST|Sakshi

దిమాపూర్‌: పశ్చిమ బెంగాల్‌కు చెందిన గౌర్‌ దాస్‌ రిక్షావాలా.. పొరుగున ఉన్న నాగాల్యాండ్‌లోని దిమాపూర్‌ నగరంలో రిక్షా నడుపుకుంటూ.. బతుకు వెళ్లదీసే గౌర్‌ దాస్‌ దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. నాగాల్యాండ్‌ ప్రభుత్వ లాటరీలో అతను తాజాగా రూ. 50 లక్షలు గెలుపొందాడు. దీంతో రిక్షావాలా కాస్తా ఓవర్‌నైట్‌ రిచ్‌వాలా అయిపోయాడు.

ఆ రోజు వర్షమే రాకపోతే.. 
సెప్టెంబర్‌ 29వ తేదీన గౌర్‌ దాస్‌ తన తోటి రిక్షా యూనియన్‌ స్నేహితులతో కలిసి పిక్‌నిక్‌కు వెళ్లాలనుకున్నాడు. కానీ ఆ రోజు తెడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పిక్‌నిక్‌ వెళ్లాలన్న ఆలోచన మానుకున్నాడు. ఈ తర్వాత ఇంటికి తిరిగొస్తుండగా ఓ వ్యక్తి ఎదురుపడి.. నాగాలాండ్‌ ప్రభుత్వ లాటరీ టికెట్లు కొనుమంటూ బతిమాలాడు. గౌర్‌ దాస్‌ వద్దు జేబులో 70 రూపాయలు మాత్రమే ఉన్నాయి. లాటరీ టికెట్టు ధర రూ. 30. లాటరీ కొనాలని లేకపోయినా.. అమ్మే వ్యక్తి పదేపదే బతిమాలి.. బలవంతం చేయడంతో దానిని కొన్నాడు. ఆ రోజు వర్షం పడకపోయి ఉంటే.. తాము పిక్‌నిక్‌కు వెళ్లేవాళ్లమని, లాటరీ టికెట్‌ను తాను కొని ఉండేవాడిని కాదని గౌర్‌ దాస్‌ ‘న్యూస్‌-18’కు తెలిపాడు. 

గత ఆదివారం లాటరీ ఫలితాలు వచ్చాయి. తనకు అంతగా నమ్మకం లేకపోయినా ఓ దుకాణం వద్దకు వెళ్లి ఫలితాలను చెక్‌ చేసిన గౌర్‌ దాస్‌ షాక్‌ తిన్నాడు. లాటరీ విజేతల్లో తన టికెట్‌ నంబర్‌ ఉంది. తనకు రూ. 50 లక్షలు  వచ్చాయి. ఆనందంతో ఎగిరి గంతేసిన గౌర్‌ దాస్‌ తన భార్యకు మాత్రేమే ఈ విషయాన్ని చెప్పాడు. కానీ, సెక్యూరిటీ భయంతో ఇరుగు-పొరుగు వారికి చెప్పలేదు. మరునాడు బ్యాంకుకు వెళ్లి లాటరీ టికెట్‌ను డిపాజిట్‌ చేశాడు. ఈ లోపు ఈ వార్త మీడియాలో రావడంతో లాటరీ విజేతగా గౌర్‌ దాస్‌ స్థానికంగా ఫేమస్‌ అయిపోయాడు.

మరిన్ని వార్తలు