వేలి ఉంగరంతోనూ నగదు చెల్లింపులు

4 Mar, 2020 19:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు జేబులో పర్సు, పర్సులో డబ్బులు లేకుండా ఎలాంటి చెల్లింపులు జరిగేయి కాదు. అయితే ఎలాంటి చెల్లింపులైన జరిపేందుకు 2011లో ‘మాస్టర్‌ కార్డు’ అందుబాటులోకి రావడంతో బ్యాంకింగ్‌ లావా దేవీలకు సంబంధించి దాన్ని ఓ పెద్ద విప్లవంగా పేర్కొన్నారు. అప్పట్లో ఆ కార్డు కేవలం వీఐపీలకే అందుబాటులో ఉండేది. 2014లో బార్ల్కేల కార్డు అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఏడాదికి స్మార్ట్‌ ఫోన్‌ను ఉపయోగించి ‘ఆపిల్‌ పే’ విధానం అందుబాటులోకి వచ్చింది. 

ఇప్పుడు బ్యాంక్‌ క్రెడిట్, డెబిట్‌ కార్డులతోపాటు పేటీఎం, రూపే, గూగుల్‌ పే ఎన్నో డబ్బు చెల్లింపు యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. సరికొత్తగా చొక్కా చివరన గుండీలాగా అమర్చుకునే చిప్, వేలికి ధరించే ఉంగరం, కంకణం వంటి పరికరాల చెల్లింపులు జరిపే సౌకర్యం అందుబాటులోకి వచ్చాయి. చెల్లింపు మిషన్‌ వద్దకు ఈ చిప్, ఉంగరం లేదా కంకణంను తీసుకెళ్లి కావాల్సినంత చెల్లింపులు జరపవచ్చు. క్రెడిట్‌ కార్డుల్లాగా ఇవి పనిచేయవు. ఖాతాలో డబ్బులు ఉన్నప్పుడే పని చేస్తాయి. పైగా ఇవన్నీ యాప్‌లకు అనుసంధానించి పని చేస్తాయి. 

చేతికి ధరించిన కంకణం ద్వారా చెల్లింపులు జరపాలంటే బార్ల్కేల తీసుకొచ్చిన ‘పింగిట్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందే. అలాగే పనిచేసే ‘కే’ ఉంగరం నలుపు, తెలుపు రంగుల్లో లభిస్తోంది. మూడింటిలో ఇదే ఖరీదైనది. దాదాపు 9వేల రూపాయలకు ఈ ఉంగరం, దాని సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మిగతావి రెండున్నర వేల రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ వస్తువులు పోయినప్పుడు లేదా చోరీ అయినప్పుడు చెల్లింపులను యాప్‌ ద్వారా నిలిపివేయవచ్చు. 2024 సంవత్సరానికి ఇలాంటి చెల్లింపు పద్ధతులు 18 లక్షల వరకు రావచ్చన్నది ఓ అంచనా. అప్పుడు జేబులో పెన్ను, మెడలో గొలుసు, చెవి పోగులు, ముక్కు పుడక ఏ ఆభరణం రూపంలోనైనా చెల్లింపులు జరపొచ్చన్నమాట. 

మరిన్ని వార్తలు