సీబీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన శుక్లా

4 Feb, 2019 15:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ నూతన డైరెక్టర్‌గా ఇటీవల నియమితులైన 1983 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి రిషి కుమార్‌ శుక్లా సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్‌ పోలీస్‌ మాజీ చీఫ్‌ శుక్లాను శనివారం నూతన సీబీఐ డైరెక్టర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. సీబీఐ చీఫ్‌గా శుక్లా రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు.

మధ్యప్రదేశ్‌ డీజీపీగా వ్యవహరిస్తున్న శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన సెలక్షన్‌ కమిటీ సీబీఐ చీఫ్‌గా ఎంపిక చేసింది. కాగా ఈ ఏడాది జనవరి 10న సీబీఐ చీఫ్‌గా తొలగించబడిన అలోక్‌ వర్మ స్ధానంలో శుక్లా నూతన బాధ్యతలు చేపట్టారు. సీబీఐలో ఉన్నతాధికారులు అలోక్‌ వర్మ, రాకేష్‌ ఆస్ధానాల మధ్య విభేదాల పర్వంతో ఇరువురు అధికారులపై కేంద్రం వేటువేసిన సంగతి తెలిసిందే. సుప్రీం ఉత్తర్వులతో సీబీఐ చీఫ్‌గా తిరిగి నియమించబడిన అలోక్‌ వర్మను ప్రభుత్వం ఫైర్‌ సర్వీసుల డీజీగా బదిలీ చేయడంతో ఆయన ప్రభుత్వ సర్వీసుకు రాజీనామా చేశారు. మరోవైపు రాకేష్‌ ఆస్ధానాను సీబీఐ నుంచి తప్పించిన ప్రభుత్వం వేరే మంత్రిత్వ శాఖకు బదిలీ చేసింది.

మరిన్ని వార్తలు