వాద్రా మధ్యంతర బెయిల్‌ పొడిగింపు 

17 Feb, 2019 04:08 IST|Sakshi

మార్చి 2 వరకు పొడిగించిన ఢిల్లీ కోర్టు 

విచారణకు సహకరించడం లేదన్న ఈడీ 

న్యూఢిల్లీ: భూకుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బావ రాబర్ట్‌ వాద్రాకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను ఢిల్లీ కోర్టు మార్చి 2 వరకు పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు సహకరించాలని వాద్రాకు సూ చించింది. తదుపరి వాదనలు వినేంత వరకు వాద్రా ను అరెస్టు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో మరో నిందితుడు, వాద్రా సన్నిహితుడు మనోజ్‌ అరోరాను కూడా మార్చి 2 వరకు అరెస్టు చేయకూడదని ఈడీని ఆదేశించింది. 

మనీల్యాండరింగ్‌ కేసులో వాద్రా విచారణకు సహకరించడం లేదని.. అతడిని మరింత ప్రశ్నించాల్సి ఉందని ఈడీ కోర్టుకు నివేదించింది. విచారణకు సంబంధించిన విషయాలను వాద్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తున్నారంది. అతడికి మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. ఈ వాదనలను వాద్రా తరఫు న్యాయవాది ఖండించారు. ఈడీ ఆదేశించిన ప్రతిసారీ వాద్రా విచారణకు హాజర య్యారని, తదుపరి విచారణకు కూడా హాజరయ్యేందుకు సిద్ధం గా ఉన్నారని కోర్టుకు తెలిపారు.  వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. వాద్రా మధ్యంతర బెయిల్‌ ను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.  

విచారణ పేరుతో వేధిస్తున్నారు.. 
ఈడీ విచారణ తీరుపై రాబర్ట్‌ వాద్రా మండిపడ్డారు.  విచారణకు సహకరిస్తున్నా అధికారులు తనను వేధిస్తున్నారన్నారు. రూ. 4.62 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్‌ వేదికగా ఈడీపై విమర్శల వర్షం కురిపించారు. ఈడీ ఆదేశించిన నాటి నుంచి తాను విచారణకు సహకరిస్తున్నానని, ఏమీ దాయ డం లేదని స్పష్టం చేశారు. 6 రోజుల నుంచి రోజూ 8 నుంచి 12 గంటల పాటు తనను విచారిస్తున్నారని తెలిపారు. లంచ్‌కు మాత్రమే 40 నిమిషాల విరా మం ఇచ్చేవారని చెప్పారు. వాష్‌రూమ్‌కు వెళ్లే సమయంలో కూడా తన వెంట అధికారులను పంపే వారని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు