భారత్‌లో 3.5 కోట్ల మంది ఉద్యోగాలకు ఎసరు!

2 May, 2017 17:03 IST|Sakshi
భారత్‌లో 3.5 కోట్ల మంది ఉద్యోగాలకు ఎసరు!

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ప్రధాన రంగాల్లో ఈ రంగం ఒకటిగా ఎదిగిన విషయం తెల్సిందే. ఈ రంగంలో చోటు చేసుకుంటున్న రోబోఠఙక్‌ సాంకేతిక పరిజ్ఞానం మరో 30 ఏళ్ల నాటికి యాభైశాతం కార్మికులను రోడ్డున పడేయనుంది. ముఖ్యంగా 2025 సంవత్సరం నాటికి భవన నిర్మాణ రంగంలో భారత్‌ ప్రపంచంలోనే మూడవ దిగ్గజ దేశంగా ఎదుగుతున్న అంచనాల నేపథ్యంలో కార్మికుల పట్ల ఇది ప్రతికూల పరిణామమే.

న్యూయార్క్‌లోని ఓ కంపెనీ తయారు చేసిన సెమీ ఆటోమేటిక్‌ మిషన్లు (ఎస్‌ఏఎం) ఇప్పటికే ఇటుక గోడల నిర్మాణంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. ప్రస్తుతం వీటిని అమెరికాలో ఉపయోగిస్తుండగా, త్వరలోనే బ్రిటన్‌లో ఉపయోగించనున్నారు. మానవులు రోజుకు 500 ఇటుకలతో కూడిన గోడను నిర్మించగలిగితే ఈ సెమీ ఆటోమేటిక్‌ మిషన్లు రోజుకు 3000 ఇటుకలతో గోడలను నిర్మించగలుగుతున్నాయి. ఈ విషయంలో పెర్త్‌లోని ఓ రోబోటెక్‌ కంపెనీ ఇంతకన్నా అధునాతనమైన రోబో యంత్రాలను కనిపెట్టాయి. ప్రయోగాత్మక పరీక్షలు కూడా విజయవంతం అవడంతో ఆ కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి వీటిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకుంటోంది.

ఇటుక గోడల నిర్మాణానికి రానున్న దశాబ్దం మొత్తం రోబోటిక్‌ యంత్రాలదేనని ఇదే ప్రాజెక్ట్‌ మీద పనిచేస్తున్న స్విడ్జర్లాండ్‌ పరిశోధకులు తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన ఇంజనీర్‌ హాడ్రియన్‌ రెండు రోజుల్లో ఇంటిని నిర్మించే రోబో యంత్రాలను 2015లో డిజైన్‌చేసి వాటి మీద పని చేస్తున్నారు.

అవి కూడా మార్కెట్లోకి వచ్చినట్లయితే ఈ రంగం మీద ఆధారపడి బతుకుతున్న కార్మికులకు మరింత ప్రమాదం. ప్రస్తుతానికి రోబోలను పని చేయించడానికి కొంత సిబ్బంది అవసరం అవుతున్నారు. పోనుపోను సిబ్బంది అవసరం లేకుండానే రోబోలే అన్ని పనులు చేసుకుంటూ పోతాయట. ఈ పరిణామాల నేపథ్యంలో రానున్న 30 ఏళ్లలో భారత్‌లో మూడున్నర కోట్ల మంది కార్మికులు రోడ్డున పడతారని నిపుణుల అంచనా.

మరిన్ని వార్తలు