పీఎంకేవై కింద 12,305 కోట్ల పంపిణీ

22 Jun, 2019 09:58 IST|Sakshi

న్యూఢిల్లీ: అర్హులైన రైతులకు పీఎం కిసాన్‌ పథకం(పీఎంకేవై) కింద ఇప్పటి వరకూ రూ. 12,305 కోట్లు పంపిణీ చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రైతులకు పెట్టుబడి సాయంగా ప్రధానమంత్రి కిసాన్‌ పథకం కింద అందించే రూ. 6,000 మూడు దఫాల్లో చెల్లించనున్నామని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా 14.5కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారని చెప్పారు. భూపరిమితితో నిమిత్తం లేకుండా సహాయం అందిస్తున్నామని, దీనివల్ల ప్రభుత్వంపై రూ. 87,215.50 కోట్ల భారం పడనున్నదని తెలిపారు.

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు ఢిల్లీతో పాటు రాజస్థాన్‌, పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో పంట అవశేషాలను తగులబెట్టడాన్ని నిషేధించినట్టు నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. ఎవరైనా నిషేధాన్ని ఉల్లంఘిస్తే వారి నుంచి రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ నష్టపరిహారం వసూలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. రబీ సీజన్‌లో వరి చేలల్లో మిగిలిపోయిన పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి చర్యల కారణంగా ఆ ప్రభావం ఢిల్లీపై పడుతోంది.

మరిన్ని వార్తలు