పూలమ్ముకునే మహిళ ఖాతాలోకి 5.81 కోట్లు

14 Jan, 2017 14:09 IST|Sakshi

మైసూరు (కర్ణాటక): పూలు అమ్ముకునే ఓ మహిళ బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.5.81 కోట్ల నగదు జమ అయిన ఉదంతం కర్ణాటకలోని మైసూరు జిల్లా  హుల్లహళ్లిలో శుక్రవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన నాగరాజు భార్య నీలా స్థానిక బస్టాండ్‌లో పూల వ్యాపారం చేస్తోంది. ఆమెకు గ్రామంలోని కార్పొరేషన్‌ బ్యాంకులో జన్‌ధన్‌ ఖాతా ఉంది.

ఈ నెల 8న ఆమె ఖాతాలో రూ. 5.81 కోట్లు జమ అయ్యింది. ఆమె బుధవారం బ్యాంకుకు వెళ్లింది. ఖాతా పుస్తకాన్ని ఎంట్రీ చేయించగా.. రూ. 5.81 కోట్ల నగదు జమ అయినట్లు తేలింది. ఉక్కిరిబిక్కిరైన ఆమె మేనేజర్‌ను కలిసి పాస్‌పుస్తకం చూపించింది. అయితే.. ఆ మొత్తం ఎలా జమ అయ్యిందో తనకు కూడా తెలియదని మేనేజర్‌ చెప్పారు. అయితే.. ఆ మొత్తం ఎవరు జమ చేశారనే విషయాన్ని వారు వెల్లడించలేదు.

మరిన్ని వార్తలు