బ్యాంకు సిబ్బందిపై దాడి : రూ. 70 లక్షలు లూటీ

17 Sep, 2014 08:31 IST|Sakshi

ఘజియాబాద్: బ్యాంక్ ప్రధాన బ్రాంచి నుంచి వివిధ బ్యాంకు శాఖలకు తరలిస్తున్న భారీ నగదును దుండగులు సినీ ఫక్కీలో చోరీ చేశారు. ఆ ఘటన హపూర్ జిల్లాలోని దాలునా పట్టణంలో నిన్న చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం... పట్టణంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నుంచి దాదాపు రూ. 60 లక్షల నగదు... ఆదే పట్టణంలోని రెండు శాఖలకు తరలించారు. ఆ క్రమంలో ముందుగా వశిష్ట చౌక్లో సహకార బ్యాంక్ బ్రాంచ్ వద్దకు నగదుతో ఉన్న వాహనం చేరుకుంది. ఆ నగదును వాహనం నుంచి బ్యాంకులోకి తరిలిస్తున్న క్రమంలో... అప్పటికే అక్కడ ఆరు మోటర్ సైకిళ్లపై మాటువేసిన దుండగులు ఒక్కసారిగా నగదు తీసుకువెళ్తున్న సిబ్బందిపై దాడి చేసి రూ.60 లక్షలు దోచుకున్నారు.

అనంతరం వాహనంలో వచ్చిన అధికారులు సిబ్బందితోపాటు బ్యాంకులోని అధికారులను గదిలో బందించి.... బ్యాంకులో నిల్వ ఉన్న నగదు రూ. 10 లక్షలు కూడా దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. అంతకుమందు బ్యాంకులోని సీసీటీవీ కెమెరాలతోపాటు కంప్యూటర్లను కూడ ఆగంతకులు ధ్వంసం చేశారు. బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు