రూ. 27.68 లక్షల జరిమానా చెల్లించాడు

9 Jan, 2020 11:28 IST|Sakshi

అహ్మదాబాద్‌: సరైన పత్రాలు లేవని తన కారును అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పోర్షే 911 స్పోర్ట్స్‌ కార్‌ యజమాని పన్నులు, వడ్డీ, జరిమానా కలిపి రూ. 27.68 లక్షలు చెల్లించి తన కారును తీసుకువెళ్లారు. ఈ మొత్తాన్ని అహ్మదాబాద్‌ ప్రాంతీయ రవాణా కార్యాలయం(ఆర్టీవో)లో చెల్లించిన కారు యజమాని రంజిత్‌ దేశాయ్‌ సిటీ ట్రాఫిక్‌ పోలీసుల స్వాధీనంలో ఉన్న తన కారును తీసుకువెళ్లారు. గడిచిన ఏడాది నవంబర్‌లో ఈ కారును ట్రాఫిక్‌ పోలీసులు సీజ్‌ చేశారు. నవంబర్‌ 28న హెల్మెట్‌ క్రాస్‌రోడ్‌ వద్ద నెంబర్‌ ప్లేట్లు లేని కారణంగా కారును ట్రాఫిక్‌ పోలీసులు నిలిపివేశారు.

దీనిపై ట్రాఫిక్‌ పోలీసులు ప్రశ్నించగా డ్రైవర్‌ సరైన పత్రాలు చూపించలేకపోయారని పోలీస్‌ అధికారులు తెలిపారు. దీంతో తాము కారును సీజ్‌ చేసి మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం మెమో జారీ చేశామని చెప్పారు. తొలుత రూ. 9.8 లక్షల జరిమానా విధించగా కారు ఓనర్‌ ఆ మొత్తాన్ని డిపాజిట్‌ చేశారని, ఆపై పాత రికార్డులను పరిశీలించి భారీ మొత్తం జరిమానా వడ్డించామని తెలిపారు. కాగా రూ. 27.68 లక్షల జరిమానా చెల్లించినట్టు ఇచ్చిన రసీదును ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన అహ్మదాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు దేశంలో అత్యధిక మొత్తంలో విధించిన జరిమానా ఇదే అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు