గోవాలో మహాకూటమి

11 Jan, 2017 03:14 IST|Sakshi

జట్టుకట్టిన ఎంజీపీ, జీఎస్‌ఎం, శివసేన
పణాజి: బీజేపీ అవకాశాలను దెబ్బతీయడమే లక్ష్యంగా రాబోయే గోవా  అసెంబ్లీ ఎన్నికల కోసం మహారాష్ట్రవాడి గోమంతక్‌ పార్టీ(ఎంజీపీ), గోవా సురక్షా మంచ్‌(జీఎస్‌ఎం),  శివసేన మహాకూటమిగా ఏర్పడ్డాయి. జీఎస్‌ఎంను ఆరెస్సెస్‌ తిరుగుబాటు నేత సుభాష్‌ వెలింగ్‌కర్‌ స్థాపించగా,  ఎంజీపీ ఈ మధ్యే అధికార బీజేపీతో తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో , మహారాష్ట్రలో బీజేపీ భాగస్వామిగా ఉన్న శివసేన తొలిసారి గోవాలో అదృష్టం పరీక్షించుకోబోతోంది.  35 నుంచి 40 సీట్లలో పోటీచేయబోతున్న ఈ కూటమి ఎంజీపీ నాయకుడు సుదిన్‌ ధావలికర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. వెలింగ్‌కర్‌ కన్వీనర్‌గా ఓ సమన్వయ కమిటీని కూడా ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ‘ భాగస్వాముల మధ్య సీట్ల పంపకంతో ఎన్నికల్లో పోటీచేస్తాం. ఇది భావసారూప్యాలున్న పార్టీల కలయిక’ అని సుదిన్‌ ధావలికర్‌ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతున్న పాఠశాలలకు ప్రభుత్వ గ్రాంట్లను ఉపసంహరించుకోవడమే తొలి నిర్ణయమవుతుందని వెలింగ్‌కర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు