గ్రామాల్లో తగ్గి పట్టణాల్లో పెరిగిన నిరుద్యోగం

1 Jul, 2020 18:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య ఆరు లక్షలకు చేరువైందనే విచారకర వార్తలతోపాటు లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో అనూహ్యంగా పెరిగి పోయిన నిరుద్యోగుల సంఖ్య లాక్‌డౌన్‌కు ముందున్న పూర్వ స్థితికి చేరుకుందన్న మంచి వార్త కూడా వెలువడింది. లాక్‌డౌన్‌ కాలం నాటికి దేశంలో నిరుద్యోగుల సంఖ్య 8.5 శాతానికి చేరుకుంది. అది కూడా గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతకన్నా ఎక్కువ.

లాక్‌డౌన్‌ కారణంగా 8.5 శాతం ఉన్న నిరుద్యోగుల సంఖ్య మూడు నెలల కాలంలోనే మే నెల మూడవ తేదీ నాటికి 27.1 శాతానికి చేరుకుంది. లాక్‌డౌన్‌ సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగుల సంఖ్య దారుణంగా పెరిగిపోగా గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుతూ వచ్చింది. లాక్‌డౌన్‌ సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగుల సంఖ్య 9 శాతం నుంచి దాదాపు 28 శాతానికి పెరిగి, జూన్‌ 21వ తేదీ నాటికి 11 శాతానికి పడి పోయింది. అదే గ్రామీణ ప్రాంతాల్లో జూన్‌ 21వ తేదీ నాటినికి నిరుద్యోగుల సంఖ్య 7.26 శాతానికి పడిపోయింది. లాక్‌డౌన్‌ విధించడానికి పూర్వం అక్కడ నిరుద్యోగుల సంఖ్య 8.3 శాతంగా ఉంది.

లాక్‌డౌన్‌కు ముందు దేశంలో ఉన్న నిరుద్యోగుల సంఖ్య ఎంతుందో, లాక్‌డౌన్‌ తదనంతరం మళ్లీ ఆ స్థాయికి చేరుకోవడం సంతోషకరమైన మాటే అయినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగుల సంఖ్య పెరగడం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు, కూలీ రేట్లు పడిపోవడం విచారకరం. ఏడాది క్రితం ఉన్న వేతనాలకన్నా తక్కువ ఇస్తున్నారని, భవిష్యత్తులో పెంచుతారనే ఆశ కూడా లేకుండా పోయిందని పలు ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఉచిత బియ్యం సరఫరాను మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ నిన్ననే ప్రకటించారు. ఇంకా దేశంలో ఆహార నిల్వలు పది కోట్ల టన్నులకుపైగా ఉండడంతో ఈ స్కీమ్‌ పెద్దగా భారం కాదని బీజేపీ నాయకులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు