రష్యాతో క్షిపణి ఒప్పందానికే మొగ్గు

3 Sep, 2018 05:41 IST|Sakshi

న్యూఢిల్లీ: రష్యా నుంచి ఎస్‌–400 ట్రయంఫ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ క్షిపణి వ్యవస్థల కొనుగోలుపై తన నిర్ణయాన్ని తర్వలో అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులతో జరగనున్న సమావేశంలో భారత్‌ స్పష్టం చేయనుంది. రష్యాపై అమెరికా ఆంక్షలకు విరుద్ధంగా ఉన్న రూ. 40 వేల కోట్ల ఈ ఒప్పందంపై ముందుకెళ్లాలని అమెరికాకు మనం దేశం తేల్చిచెప్పనుంది. ప్రాంతీయ రక్షణ వ్యవస్థను పటిష్టపర్చడం అత్యవసరమైన నేపథ్యంలో ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ భారత్‌కు తప్పనిసరి.. అందువల్ల ఒప్పందాన్ని ఆంక్షల పరిధి నుంచి తప్పించాలని ట్రంప్‌ యంత్రాగాన్ని కోరనుంది. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో పరస్పర ప్రయోజనాలపై సెప్టెంబర్‌ 6న భారత్, అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు జరగనున్నాయి. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, రక్షణ మంత్రి జేమ్స్‌ మ్యాటిస్‌లతో చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో రష్యాతో ఒప్పందంపై మన మంత్రులు ఒత్తిడి తేనున్నారు.

మరిన్ని వార్తలు