'నాకు 30 సెకన్లు పట్టింది.. మరి మీకు'

5 Jun, 2020 17:47 IST|Sakshi

జైపూర్‌ :  రాజస్తాన్‌ డిప్యుటీ సీఎం, కాంగ్రెస్‌ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ రాజకీయాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా రాజస్తాన్‌ సంప్రదాయమైన తలపాగాను కేవలం 30 సెకన్లలోనే చుట్టుకొని ఆశ్చర్యపరిచారు. నిజానికి తలపాగా చుట్టుకోవడమనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మనం ఒకదిక్కు పెడుతుంటే మరోవైపు ఊడిపోతుంది. అనుభవం ఉన్నవాళ్లు మాత్రం పంగడీ(తలపాగా)ని వేగంగానే ధరిస్తారు. కాగా సచిన్‌ తలపాగా చుట్టుకుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేగాక ' నా చాలెంజ్‌ పూర్తయింది.. మరి మీరు ఎంతసేపట్లో పూర్తి చేస్తారంటూ' ప్రశ్నించారు.(ఛోటా భీమ్..‌ చుట్కీని ఒంట‌రిదాన్ని చేశాడా?)

కాగా ఈ వీడియోనూ ఆయన తన ట్విటర్‌లో షేర్‌ చేశారు.' పంగడీకి నా మద్దతు ఎప్పుడు ఉంటుంది. తలపాగా అనేది రాజస్తాన్‌ సంప్రదాయాన్ని గుర్తుచేస్తుంది. అంతేకాదు ఇది వీరులను గుర్తు చేస్తుంది' అంటూ క్యాప్షన్‌ జత చేశారు. కాగా సచిన్‌ పైలట్‌ లండన్‌కు వెళ్లినప్పుడు నెహ్రూ సెంటర్‌ వాళ్లు ఈ వీడియా తీశారు. తాజాగా సచిన్‌ పైలట్‌ ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోనూ చాలా మంది తిలకించగా, వేలకొద్ది లైకులు, రీట్వీట్‌లు వస్తున్నాయి.' సచిన్‌ పైలట్‌.. మీరు రాజకీయాల్లోనే కాదు.. తలపాగా చుట్టుకోవడంలోనే మంచి నైపుణ్యతను ప్రదర్శిస్తారు' అంటూ కామెంట్లు పెడుతున్నారు. 
(మంత్రి కేటీఆర్‌కు థ్యాంక్స్‌ చెప్పిన మీరాచోప్రా)

మరిన్ని వార్తలు