'ఆ వీడియో నేను అప్‌లోడ్‌ చేయలేదు'

31 Jan, 2018 11:19 IST|Sakshi
తేజ్‌ బహదూర్‌ యాదవ్‌, బీఎస్‌ఎఫ్‌ బహిష్కృత జవాన్‌

సాక్షి, చండీగఢ్‌ : సరిహద్దులో గస్తీ కాస్తున్న సైనికులకు పౌష్టికాహారం పెట్టడం లేదంటూ సంచలన వీడియో పోస్ట్‌ చేసి అనంతరం ఉద్యోగాన్నికోల్పోయిన బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ కోర్టు మెట్లెక్కారు. తన ఉద్యోగాన్ని తనకు తిరిగి ఇప్పించాలంటూ హర్యానా కోర్టును ఆశ్రయించారు. ఆ వీడియోను తాను అప్‌లోడ్‌ చేయలేదని, తన సహచరులే ఆ పనిచేశారని కోర్టుకు వెళ్లడించారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన ధర్మాసనం దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర హోంశాఖకు, బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కేకే శర్మకు, బీఎస్‌ఎఫ్‌ 29 బెటాలియన్‌ కమాండెంట్‌కు నోటీసులు పంపించింది. తదుపరి విచారణను వచ్చే మే (2018) 28కి వాయిదా వేసింది.

తమకు సరైన ఆహారం పెట్టడం లేదంటూ ఓ సెల్ఫీ వీడియోను తేజ్‌ బహదూర్‌ గత ఏడాది (2017) జనవరి 8న ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేయడంతో దేశ వ్యాప్తంగా పెను సంచలనం అయింది. ఆ వీడియో పోస్ట్‌ చేసిన తర్వాత పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. అతడిని ఎవరికీ తెలియని చోట పోస్టింగ్‌ ఇచ్చారని కక్ష పూరితంగా వ్యవహరించారిన తేజ్‌ భార్య కూడా ఆరోపించింది. అయితే, తేజ్‌ ఉద్దేశ పూర్వకంగా ఈ పనిచేశాడని పేర్కొంటూ ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ బీఎస్‌ఎఫ్‌ నిర్ణం తీసుకుంది. అయితే, ఆ వీడియోను తాను పోస్ట్‌ చేయలేదని, తన సహచర ఉద్యోగుల్లో ఎవరో ఒకరు అది చేసి ఉంటారని, అతడి ఉద్యోగంపై వేసిన వేటును బీఎస్‌ఎఫ్‌ వెనక్కు తీసుకొని తిరిగి ఉద్యోగం ఇవ్వాలంటూ తేజ్‌ తరుపు న్యాయవాది తాజాగా కోర్టును అభ్యర్థించారు.

మరిన్ని వార్తలు