నెహ్రూపై ప్రజ్ఞా సింగ్‌ సంచలన వ్యాఖ్యలు

19 Aug, 2019 20:03 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నేరస్తుడని బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 అమలుచేశారని నెహ్రూను క్రిమినల్‌గా అభివర్ణించిన మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వ్యాఖ్యలను ప్రజ్ఞా సింగ్‌ సమర్ధించారు. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ దేశమాతను బాధించేవారు, దేశాన్ని ముక్కలుగా చేయాలనుకునే వారెవరైనా నేరస్తులేనని వ్యాఖ్యానించారు.

ఆర్టికల్‌ 370, 35 ఏను రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలపై ఆమె ప్రశంసలు కురిపించారు. మోదీ, అమిత్‌ షా దేశభక్తులని కొనియాడారు. ఆర్టికల్‌ 370 రద్దును దేశభక్తులు స్వాగతిస్తుంటే..దీన్ని స్వాగతించలేనివారు ఎన్నటికీ దేశభక్తులు కాలేరని స్పష్టం చేశారు. కాగా గతంలో మహాత్మా గాంధీపై ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెనుదుమారం సృష్టించిన సంగతి తెలిసిందే.  మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే ఎన్నటికీ దేశభక్తుడేనని సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి పార్టీ చీఫ్‌ అమిత్‌ షా తీవ్రంగా ఖండించారు.

మరిన్ని వార్తలు