‘పవర్‌ కట్‌’పై సాక్షి ధోని ఆగ్రహం

20 Sep, 2019 17:47 IST|Sakshi

రాంచీ : వేళాపాళా లేని కరెంట్‌ కోతలు సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలను సైతం ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా ఇలాంటి అనుభవాన్నే టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని సతీమణి సాక్షి సింగ్‌ ధోని ఎదుర్కొన్నారు. జార్ఖండ్‌ రాజధాని రాంఛీలో గత కొద్ది రోజులుగా కరెంట్‌ కోతలతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని సాక్షి మండిపడ్డారు. కరెంట్‌ కోతలపై ట్విట్టర్‌ వేదికగా సాక్షి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

‘ప్రతి రోజు కరెంట్‌ కోతలతో రాంచీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపు రోజూ 4 నుంచి 7 గంటలు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నారు. ఈ రోజు కరెంట్‌ లేక ఐదు గంటలవుతుంది. ఈ రోజు విద్యుత్‌ సరఫరాను ఎందుకు నిలిపివేశారో అర్థం కావడం లేదు. ఈ రోజు పండగ కాదు.. వాతావరణం కూడా బాగానే ఉంది. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’అంటూ ట్వీట్‌ చేశారు.

ఇక సాక్షి ట్వీట్‌పై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొనిపోయే విధంగా సాక్షి ట్వీట్‌కు సీఎం, ఇతర ఉన్నతాధికారుల పేర్లను జతచేస్తూ పలువురు నెటిజన్లు రీట్వీట్‌ చేస్తున్నారు. మరోవైపు ధోని ప్రకటన ఇస్తున్న ఇన్వెర్టర్‌ను వాడాలని మరికొందరు సరదా సలహాలు ఇస్తున్నారు.     

>
మరిన్ని వార్తలు