‘డిసెంబర్‌ 6లోపే రామ మందిర నిర్మాణం’

26 Oct, 2019 20:21 IST|Sakshi

బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ సంచలన వ్యాఖ్యలు

ఉన్నావ్‌(యూపీ): అయోధ్యలోని రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా డిసెంబర్‌ 6లోపే రామ మందిర నిర్మాణం ప్రారంభం కానున్నట్లు శనివారం వివాదస్పద బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టులో రామ మందిర నిర్మాణంపై జరుగుతున్న విచారణ పూర్తికావచ్చిందని తీర్పు వెల్లడించడమే మిగిలి ఉందన్నారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు రామ మందిరానికి అనుకూలంగానే వస్తుందని నొక్కిచెప్పారు. నిరవధికంగా నలభై రోజులపాటు ఇరుపక్షాల వాదనలు విని, విచారించిన సుప్రీంకోర్టు జడ్జీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్యలో పురావస్తు శాఖ వాస్తవాలను వెలికితీసి సుప్రీంకోర్టుకు సమర్పించిందని, ఇప్పటికే రామ మందిర నిర్మాణానికి షియా వక్ఫ్ బోర్డు అంగీకారం తెలిపిందన్నారు. ఒకవేళ అయోధ్య కేసులో సుప్రీం కోర్టు రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే అని ప్రశ్నించగా.. ‘నేను సాక్షిని. సుప్రీం కోర్టు ఏ తీర్పు ఇవ్వబోతుందనే అంశంపై నాకు స్పష్టత ఉంది. డిసెంబర్‌ 6లోపే రామ మందిర నిర్మాణం ప్రారంభమవుతుంద’ని వక్కాణించారు.

అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తే, ఆ భూమిని తాము ఎవరికీ ఇవ్వబోమని ఇటీవల లక్నోలో జరిగిన సమావేశంలో ముస్లిం పర్సనల్‌ లా బోర్డు తీర్మానించింది.  

>
మరిన్ని వార్తలు