స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ)

24 Nov, 2019 10:22 IST|Sakshi

ఎస్పీజీ భద్రత.. వీవీఐపీలు, వీఐపీలకు ప్రాణ రక్షణ కోసం కల్పించే భద్రత. కానీ రాను రాను భారత్‌లో వీఐపీల భద్రత ఒక సామాజిక హోదాగా మారిపోయింది. ఆ భద్రత తీసేస్తే పరువు పోయినట్లుగా నేతలు విలవిల్లాడిపోతారు. అసలు భద్రత అంటేనే ఒక హడావుడి, ఒక హంగామా. కారు వెంట పరుగులు తీసే కమాండోలు, కారు తలుపు తీసి యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌ అనే అధికారులు, వీఐపీలపై ఈగ వాలకుండా చూసే భద్రతా నైపుణ్యం కలిగినవారు ఎస్పీజీలో ఉంటారు. గాంధీ కుటుంబానికి తాజాగా మోదీ ప్రభుత్వం ఎస్పీజీ భద్రత తొలగించడంపై రాజకీయంగా తీవ్ర కలకలం రేగింది. ఇప్పుడు మాజీ ప్రధానుల కుటుంబాలకు కూడా ఎస్పీజీ భద్రత కట్‌ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించిన సవరణ బిల్లును వచ్చేవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో వీఐపీల భద్రత చర్చనీయాంశమైంది. ఇదే ఇవాళ్టి సండే స్పెషల్‌.. 

ఎస్పీజీ భద్రత అంటే...

శౌర్యం, సమర్పణం, సురక్షణం.. ఈ మూడు సూత్రాలే ప్రాతిపదికగా మన దేశంలో ఎస్పీజీ పనిచేస్తుంది. అత్యంత శిక్షణ పొందిన ఘటికులైన అధికారులు ఈ గ్రూపులో ఉంటారు. దాదాపుగా 3 వేల మంది భద్రతా అధికారులు శిక్షణ పొంది సదా మీ సేవలో అన్నట్లుగా సిద్ధంగా ఉంటారు. వీసమెత్తు కూడా లోపాల్లేని భద్రతా వ్యవస్థను కల్పించడం వీరి బాధ్యత. సీఆర్‌పీఎఫ్‌ నుంచి మెరికల్లాంటి అధికారుల్ని ఏరి వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ఎస్పీజీ గ్రూపులో పనిచేయాలంటే సామాన్యమైన విషయం కాదు. ఆ అధికారులకు శారీరక దారుఢ్యం, నాయకత్వ లక్షణాలు, వృత్తి పట్ల నిబద్ధత, భద్రతా వ్యవహారాలపై సంపూర్ణ పట్టు, కమ్యూనికేషన్‌ స్కిల్స్, ఎక్కడ ఎలా మెలగాలన్న అవగాహన వంటివి మెండుగా ఉండాలి. 

ప్రధాని వంటి వీవీఐపీలు ఇంట్లో ఉన్నా, అడుగు తీసి బయటకు వేసినా, టూర్లకు వెళ్లినా నీడలా వీరు వెన్నంటే ఉండి వారికి భద్రత కల్పిస్తారు. వీవీఐపీలు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే 24 గంటల ముందే ఆ ప్రాంతం అంతా ఎస్పీజీ కమాండోల చేతుల్లోకి వెళుతుంది. ఎస్పీజీ అధికారులతో పాటు బాంబుల్ని నిర్వీర్యం చేసే స్క్వాడ్, జాగిలాలు కూడా వారి వెంట ఉంటాయి. ఎస్పీజీ భద్రతలో భాగంగా అత్యంత ఆధునిక వాహనాలను వినియోగిస్తారు. ఆయుధాలు కలిగిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు, జామర్లు ఉంటాయి. నల్ల రంగు దుస్తులు ధరించి, చిమ్మ చీకట్లో కూడా స్పష్టంగా కనిపించే గాగుల్స్, కమ్యూనికేషన్‌ కోసం ఇయర్‌ పీస్‌లు, అత్యాధునిక ఆయుధాలతో కనురెప్ప కూడా వేయకుండా అనుమానాస్పదంగా ఎలాంటి కదలికలు కనిపించినా గ్రహించడమే వారి పని.

ఇతర భద్రతా వలయాలు...

భారత్‌లో వీఐపీలు, వీవీఐపీల కోసం వివిధ రకాల భద్రతా వ్యవస్థలు అమల్లో ఉన్నాయి. ఎస్పీజీ కాకుండా ఎక్స్, వై, జెడ్, జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతలు వీఐపీల రక్షణ కోసం పనిచేస్తున్నాయి. ప్రధానికి ఎస్పీజీ భద్రత ఉంటుంది. నాయకులకు వారి ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు ఆధారంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సమాచారాన్ని తీసుకుని భద్రత కల్పిస్తారు. ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు, రా (రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌) విభాగం నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ఏ నాయకులకు ఏ భద్రత కల్పించాలో కేంద్ర హోంశాఖ నిర్ణయిస్తుంది. 

ఎక్స్‌ కేటగిరీ: ఇది సాధారణ భద్రత. కేవలం ఇద్దరు గన్‌మ్యాన్‌లు వీఐపీలకు రక్షణగా ఉంటారు.

వై కేటగిరీ: ఈ కేటగిరీ కింద భద్రత పొందే వీఐపీలకు 11 మంది సిబ్బంది కాపలాగా ఉంటారు. ఒకరిద్దరు అధికారులు వీఐపీలు ఎక్కడికి వెళ్లినా కాపలాగా వెళతారు.
జెడ్‌ కేటగిరీ: ఈ కేటగిరీ కింద 22 మంది భద్రతా అధికారులు రక్షణగా ఉంటారు. వీరిలో నలుగురైదుగురు నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జీ) కమాండోలు ఉంటారు. ఇతర సెక్యూరిటీ అధికారుల్ని ఢిల్లీ పోలీసులు లేదంటే సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు కేటాయిస్తారు. ఒక ఎస్కార్ట్‌ వాహనం కూడా వెంట ఉంటుంది. మార్షల్‌ ఆర్ట్స్‌లో ఈ అధికారులు దిట్టలై ఉంటారు.

జెడ్‌ ప్లస్‌: ఈ కేటగిరీలో 36 మంది అధికారులు వీవీఐపీలకు నిరంతరం రక్షణ ఇస్తారు. వీరిలో 10 మందికి పైగా ఎన్‌ఎస్‌జీ అధికారులే ఉంటారు. నివాసం వద్ద రొటేషన్‌ పద్ధతిలో రక్షణ కల్పిస్తారు.

ఎస్పీజీ చట్టం కథ కమామిషు...
1984 సంవత్సరంలో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని అంగరక్షకులే దారుణంగా హత్యచేయడంతో ఆ తర్వాత ఏడాదే రాజీవ్‌ గాంధీ హయాంలో 1985 సంవత్సరంలో ఎస్పీజీ చట్టాన్ని తీసుకువచ్చారు. 1989లో వీపీ సింగ్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్‌ గాంధీకి ఎస్పీజీ భద్రతను తొలగించారు. 1991లో రాజీవ్‌ హత్య తర్వాత ఎస్పీజీ చట్టానికి సవరణలు చేశారు. మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు కనీసం పదేళ్ల పాటు ఎస్పీజీ భద్రత కల్పించడానికి వీలు కల్పిస్తూ చట్టాన్ని సవరించారు. 2003లో అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఎస్పీజీ చట్టానికి మరోసారి సవరణలు చేసింది. 

మాజీ ప్రధానులు, వారి కుటుంబాలకు పదేళ్లకు బదులుగా పదవీ కాలం ముగిసిన తర్వాత ఏడాది వరకు మాత్రమే భద్రత కల్పించాలని, ఆ తర్వాత వారికున్న ముప్పు ఆధారంగా భద్రత కల్పించే కాలాన్ని పెంచుకుంటూ వెళ్లడానికి వీలుగా చట్ట సవరణల్ని చేసింది. అలా మాజీ ప్రధానులు హెచ్‌డీ దేవేగౌడ, ఐకే గుజ్రాల్, పీవీ నరసింహారావులకు అప్పట్లోనే ఎస్పీజీ భద్రతను తొలగించారు. కొద్ది రోజుల క్రితం గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగించిన కేంద్ర ప్రభుత్వం ఇకపై మాజీ ప్రధానులు కుటుంబ సభ్యులకి భద్రత తొలగించేలా చట్టాన్ని చేయనుంది. ఈ మేరకు ఎస్పీజీ చట్టానికి చేసిన ప్రతిపాదిత సవరణల్ని కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. వచ్చేవారం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల కాలంలో కేంద్రం ఏకంగా 130మంది కీలక నేతలకు వీఐపీ భద్రతని తొలగించింది. 


గాంధీ కుటుంబానికి ఎందుకు తొలగించారంటే..

1991లో రాజీవ్‌ గాంధీ హత్య జరిగిన దగ్గర్నుంచి గాంధీ కుటుంబ సభ్యులు మాజీ ప్రధాని కుటుంబ హోదాలో ఎస్పీజీ భద్రత అనుభవిస్తున్నారు. కాలక్రమంలో ఎస్పీజీ భద్రత వారికి ఒక స్టేటస్‌ సింబల్‌గా మారిపోయిందన్న విమర్శలున్నాయి. రాహుల్‌ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఎస్పీజీ కమాండోలను వెంట తీసుకువెళ్లడం మానేశారు. గత 28 ఏళ్లలో రాహుల్‌ 150 సార్లు విదేశీ పర్యటనలకు వెళితే కనీసం 140 సార్లు ఆయన ఎస్పీజీ కమోండోలను తీసుకువెళ్లలేదు. విదేశాలకు వెళ్లినప్పుడు కనీసం కొన్నాళ్ల ముందైనా ఎస్పీజీకి సమాచారం అందిస్తే వారు అక్కడికి వెళ్లి భద్రత కల్పిస్తారు. 

కానీ రాహుల్‌ ఒక్కోసారి ఆఖరి నిమిషంలో చెప్పడం, ఒక్కోసారి చెప్పా పెట్టకుండా విదేశాలకు చెక్కేస్తుండటంతో ఎస్పీజీ భద్రతా అధికారులు ఏం చేయలేని ఇరకాటంలో పడిపోయేవారు. 2005–2014 మధ్య కాలంలో రాహుల్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ లేని వాహనంలో కనీసం 1,800 సార్లు ప్రయాణించారని ఎస్పీజీ అధికారులు వెల్లడించారు. ఎస్పీజీ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి వాహనం రూఫ్‌పైన కూడా రాహుల్‌ ప్రయాణించారు. సోనియా, ప్రియాంకా కూడా చాలాసార్లు ఎస్పీజీ కమాండోలు లేకుండా విదేశాలకు వెళ్లడం పరిపాటిగా మారింది. ఎస్పీజీ భద్రత కల్పించడం అంటే ప్రజాధనాన్ని కోట్లలో వెచ్చించడమే. ప్రస్తుతం గాంధీ కుటుంబానికి ప్రాణానికి హాని పెద్దగా లేకపోవడం, వారికి కల్పించిన ఎస్పీజీ భద్రతని సరిగా వాడుకోకపోవడంతో మోదీ సర్కార్‌ వారి భద్రతను తొలగించాలని నిర్ణయించింది. 

భద్రతా వ్యయం ఎంతంటే...
ఎస్పీజీ భద్రత కోసం ఏడాదికేడాది వ్యయం తడిసిమోపెడు అవుతూ ఉంది. జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కంటే ఎస్పీజీ భద్రతకయ్యే వ్యయం ఆరు రెట్లు ఎక్కువ. దీన్ని ఖజానా నుంచే ఖర్చు చేస్తారు.

  • 2004–13 మధ్య కాలంలో గాంధీ కుటుంబం, మన్మోహన్‌ సింగ్, అటల్‌ బిహారీ వాజ్‌పేయి భద్రత కోసం చేసిన ఖర్చు రూ. 1,800 కోట్లు 
  • 2018–19 సంవత్సరంలో కేటాయింపులు రూ. 411.68 కోట్లు
  • 2019–20 సంవత్సరంలో కేటాయింపులు రూ. 535 కోట్లు
  • ఇప్పటివరకు ఎస్పీజీ భద్రత సంపూర్ణంగా అనుభవించింది కేవలం అటల్‌ బిహారీ వాజ్‌పేయి మాత్రమే. గత ఏడాది ఆయన కన్నుమూసే వరకు ఎస్పీజీ భద్రతను కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కొనసాగించింది. ఇక ఒక వీఐపీ కోసం జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీకి నెలకయ్యే  ఖర్చు సుమారు రూ. 25 లక్షలు 
  • ఒక వీఐపీ కోసం జెడ్‌సెక్యూరిటీకి నెలకయ్యే  ఖర్చు సుమారు రూ. 15లక్షలు
మరిన్ని వార్తలు