అభినందన్‌పై సల్మాన్‌ ట్వీట్‌ : ట్రోలింగ్‌తో ఉక్కిరిబిక్కిరి

4 Mar, 2019 08:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : శత్రు సేనలకు చిక్కినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లిన భారత పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ ఎపిసోడ్‌ను రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్న క్రమంలో కాంగ్రెస్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చాయి. అభినందన్‌ యూపీఏ హయాంలోనే పైలట్‌గా ఎదిగాడని సల్మాన్‌ ఖుర్షీద్‌ చేసిన ట్వీట్‌పై నెటిజన్ల నుంచి ఆయన ట్రోలింగ్‌ ఎదుర్కొన్నారు.

అభినందన్‌ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని ఆయనకు చురకలు అంటించగా, మరికొందరు 1983లో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ జన్మించారని, ఇందుకు ఇందిరా గాంధీకి క్రెడిట్‌ ఇవ్వాలా అంటూ ఎద్దేవా చేశారు. ఖుర్షీద్‌కు నోబెల్‌ శాంతి బహుమతి వచ్చేలా చూడలంటూ కొందరు నెటిజన్లు వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.

కాగా, అభినందన్‌ శత్రుదేశంలో చూపిన సంయమనం, ధైర్యసాహసాలపై దేశవ్యాప్తంగా ఆయనకు ప్రజలు నీరాజనాలు పట్టిన సంగతి తెలిసిందే. కాగా పాక్‌పై భారత్‌ మెరుపుదాడులతో పాటు అభినందన్‌ వ్యవహారాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం చేసిన బీజేపీ నేతలపైనా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

మరిన్ని వార్తలు