అక్రమాస్తుల కేసు: సాన సతీష్‌బాబు అరెస్ట్‌

27 Jul, 2019 11:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మాంసం వ్యాపారి మెయిన్‌ ఖురేషీ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్‌కు చెందిన సతీష్‌బాబు సానను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు శనివారం అరెస్ట్‌ చేశారు. మనీలాండరింగ్‌ నియంత్రణ చట్టం ప్రకారం ఇతడిని అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. సెంట్రల్‌ ఢిల్లీలోని కార్యాలయంలో సతీష్‌ను రాత్రంతా ప్రశ్నించారు. మధ్యాహ్నం తర్వాత ఆయన్ని ఢిల్లీలోని పటియాలా కోర్టులో ఈడీ అధికారులు హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా సతీష్‌బాబుపై సీబీఐ కేసు నమోదయిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున అక్రమాస్తులను కూడబెట్టిన ఖురేషీ కేసులో సతీష్‌ సాక్షిగా ఉన్నారు.

ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నేతలకు ఆయన బినామీగా ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలోనే ఆయన వ్యక్తిగత ఆస్తులపై పలుమార్లు ఈడీ సోదాలు కూడా జరిపింది. విద్యుత్‌ డిపార్ట్‌మెంట్‌లో ఏఈగా పనిచేసిన సతీష్‌కు.. వేలకోట్ల రూపాయలు ఎలా వచ్చాయన్న దానిపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. విచారణలో అనేక విషయాలను వెల్లడించిన సతీష్‌పై మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ కేసు నమోదు చేసింది. 

మరిన్ని వార్తలు