‘పాకిస్తానీని పెళ్లి చేసుకున్న మీరు..’

12 Apr, 2018 20:29 IST|Sakshi
సానియా మీర్జా (ఫైల్‌ ఫొటో)

సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కతువా గ్యాంగ్‌రేప్‌, హత్య, ఉనావో అత్యాచార కేసు గురించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ ఘటనలను ఖండిస్తూ ఫర్హాన్‌ అక్తర్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, జావేద్‌ అక్తర్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు ట్వీట్‌ చేస్తున్నారు. తాజాగా టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ఈ దురాగతాలను ఖండిస్తూ ట్వీట్‌ చేయగా ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.

‘ఇదేనా మనం కోరుకున్న దేశం. ఎనిమిదేళ్ల బాలికకు కుల, మత, లింగ, వర్ణ భేదాలకు అతీతంగా మనం అండగా నిలబడలేకపోతే మనం ఇంకే విషయంపైనా పోరాడలేం. అది మానవత్వం అనిపించకోదు కూడా’ అంటూ భావోద్వేగంతో సానియా ట్వీట్‌ చేశారు.

సానియా ట్వీట్‌కు స్పందించిన ఓ నెటిజన్‌.. ‘గౌరవనీయులైన మేడమ్‌.. మీరు ఏ దేశం గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలిసి మీరు ఒక పాకిస్తానీని పెళ్లాడారు కదా. మీకు భారత్‌తో ఇంకా సంబంధం ఉందా. పాకిస్తాన్‌ టెర్రరిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్న అమాయక ప్రజల గురించి మీరు ట్వీట్‌ చేస్తే బాగుంటుంది అంటూ వ్యంగంగా ట్వీట్‌ చేశారు.

అయితే సానియా మీర్జా కూడా ఏమాత్రం తగ్గలేదు. ఎవరిని పెళ్లి చేసుకున్నామనేది ముఖ్యం కాదు. నేను భారత్‌ కోసం ఆడతాను. నేను భారతీయురాలిని. జీవితాంతం అలాగే ఉంటాను. నేను మీలాగా స్పందించకుండా ఉండలేను. మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరు ఇలాంటి సమయాల్లో మతాల గురించి, మరే ఇతర అంశాల గురించి మాట్లాడరని’ దీటుగా సమాధానమిచ్చారు.

మరిన్ని వార్తలు