వైరల్‌ ట్వీట్‌పై సానియా మీర్జా వివరణ

7 May, 2020 18:49 IST|Sakshi

మహిళలను చూసే విధానం మారాలి

సాక్షి, హైదరాబాద్‌ : భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా టీ 20 మహిళల ప్రపంచ కప్‌ ఫైనల్‌ సందర్భంగా వైరల్‌ అయిన తన ‘జోరు కా గులాం’ (భార్యా దాసుడు) ట్వీట్‌పై గురువారం వివరణ ఇచ్చారు. ఆస్ర్టేలియాతో భారత్‌ తలపడిన ఆ మ్యాచ్‌కు ఆస్ర్టేలియా ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ వన్డే మ్యాచ్‌కు డుమ్మా కొట్టి మరీ తన భార్య, మహిళా క్రికెట్‌ స్టార్‌ హీలీ కోసం టైటిల్‌ పోరును వీక్షించేందుకు రావడంపై సానియా ఈ ట్వీట్‌ చేశారు. మిచెల్‌ స్టార్క్‌ ఈ మ్యాచ్‌కు హాజరవడంపై అందరి ప్రశంసలు అందుకున్నారు.

సానియా సైతం స్టార్క్‌ తీరును కొనియాడుతూ ఇక ఆయనను భార్యాదాసుడు అంటారని చమత్కరించారు. కాగా, ఈ ట్వీట్‌పై భారత మహిళా క్రికెటర్లు రోడ్రిగ్స్‌, స్మృతి మంథానాలతో యూట్యూబ్‌ చాట్‌ షోలో సానియా ముచ్చటించారు. ఇది తాను సరదాగా చేసిన ట్వీట్‌ అని, తాను..అనుష్క ఈ ప్రభావానికి గురయ్యామని చెప్పుకొచ్చారు. తమ భర్తలు రాణిస్తే అది వారి ప్రతిభగా గుర్తిస్తారని..వారు సరిగ్గా రాణించని సందర్భాల్లో దానికి తాము కారణమని నిందిస్తారని సానియా అన్నారు. వారు అలా ఎందుకు అంటారో తనకు అర్ధం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మనం జోక్‌ అని చెప్పుకున్నా..లోతైన విషయం ఉందని అన్నారు. మహిళను బలహీనతగా సమాజం చూపుతుందని..బలంగా భావించదని అన్నారు.

చదవండి : కోహ్లి, సానియాకు చాలెంజ్‌ విసిరిన సింధు

అతడు తన భార్య, గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్నాడా అయితే అతడు పరధ్యానంగా ఉంటాడు..ఎందుకంటే ఆమెతో డిన్నర్‌కు వెళుతుంటాడు అనే ధోరణిలో మాట్లాడతారని..ఇది అర్థంపర్థం లేని అవగాహన అని మండిపడ్డారు. స్టార్క్‌ మహిళల వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు తన భార్య కోసం వెళ్లినప్పుడు అందరూ అతడిని ప్రశంసించారని గుర్తుచేశారు. షోయబ్‌ తన కోసం అలా చేశాడని తాను చెబితే ప్రపంచం బద్దలైనట్టు భావిస్తారని చెప్పుకొచ్చారు. అందుకే స్టార్క్‌ను అలా సంబోధించానని, అతను మహిళా క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు వెళ్లేంతగా భార్యకు దాసోహం అయ్యాడని ముద్ర వేస్తారని తాను అలా చమత్కరించానని సానియా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు