పార్టీపై విమర్శలు.. సంజయ్‌ ఝాపై వేటు

18 Jun, 2020 16:02 IST|Sakshi

న్యూఢిల్లీ: సోనియా గాంధీ బుధవారం కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవి నుంచి సంజయ్ ఝాను తొలగించారు. ఓ పత్రికలో పార్టీని విమర్శిస్తూ ఆయన వ్యాసం రాయడంతో అధిష్ఠానం ఈ చర్యకు దిగింది. ‘సంజయ్ ఝాను ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవి నుంచి వెంటనే తొలగిస్తూ సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేశారు’ అని పార్టీ ప్రకటించింది. అంతేకాక అభిషేక్ దత్‌, సాద్నా భారతిలను జాతీయ మీడియా ప్యానలిస్టులుగా నియమిస్తూ సోనియా కొత్తగా ఉత్తర్వులు జారీ చేశారు. 

‘కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరుత్సాహంలో కూరుకుపోయింది. ఫలితంగా కార్యక్షేత్రంలో అంతగా ఆసక్తి చూపలేకపోతోంది. రాజకీయంగా తీవ్ర చిక్కులు ఎదుర్కొంటుంది. ఇంత ఇబ్బందుల్లో ఉన్న పార్టీని ఉత్సాహ పరిచి నడిపించే వారు లేరు. ఇంతటి నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోలేని వారు కూడా పార్టీలో చాలా మందే ఉన్నారు. ఉదాహరణకు నా లాంటి వారు గాంధీ ఫిలాసఫీకి, నెహ్రూ దృక్పథానికి బద్ధులమైపోయాం. పార్టీ విచ్ఛిన్నాన్ని చూడలేకపోతున్నాం’ అంటూ సంజయ్ ఝా తను రాసిన వ్యాసంలో కాంగ్రెస్‌ ప్రస్తుత పరిస్థితిని తీవ్ర స్థాయిలో విమర్శించారు. దాంతో అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తూ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉత్తర్వులు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు