మోదీకి కాంగ్రెస్ నేత ప్రేమలేఖలు?

8 Oct, 2014 09:00 IST|Sakshi
మోదీకి కాంగ్రెస్ నేత ప్రేమలేఖలు?

ఐక్యరాజ్యసమితిలో కూడా పనిచేసి వచ్చి.. కేంద్రమంత్రిగా ఉండి, పలు వివాదాలకు కేంద్ర బిందువుగా, కేరాఫ్ అడ్రస్గా చెప్పుకొనే శశి థరూర్.. త్వరలోనే పార్టీ మారబోతున్నారా? ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన నుంచి ప్రేమలేఖలు వెళ్తున్నాయని కేరళ కాంగ్రెస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ వ్యవహారాన్ని శశి థరూర్ కూడా పరోక్షంగా బలపరిచారు. కాంగ్రెస్ రాజకీయాల్లో తననెప్పుడూ బయటివాడిగానే చూశారని ఆయన వాపోతున్నారు. తాను నరేంద్రమోదీని ప్రశంసించానని అంటున్నవాళ్లు తన వ్యాఖ్యలను అర్థం చేసుకోలేదని, అందువల్ల వాళ్ల విమర్శలపై స్పందించేది లేదని థరూర్ అంటున్నారు.

రాజకీయాల్లోకి తాను చాలా ఆలస్యంగా వచ్చానని, అందుకే బహుశా వీటిలో సరిగా ఇమడలేకపోతున్నానేమోనని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీజయంతి రోజున ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు అక్కడున్న తొమ్మిది మంది ప్రముఖుల్లో థరూర్ కూడా ఒకరు కావడం కేరళ కాంగ్రెస్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఆహ్వానం వచ్చినందుకు తానెంతో గౌరవంగా ఫీలవుతున్నానని ఆయన అనడాన్ని కేరళ కాంగ్రెస్ తప్పుబట్టింది. ఆయన ప్రధానికి ప్రేమలేఖలు రాస్తున్నారని కూడా కేరళ కాంగ్రెస్ పత్రిక ఆరోపించింది.

టీవీలలో వచ్చినవాళ్లందరి వద్దా తన నెంబరు ఉందని, వాళ్లు కావాలంటే తనకు నేరుగా ఫోన్ చేయచ్చు గానీ, అలా చేయకుండా బహిరంగ విమర్శలకు దిగారని, దాన్ని బట్టే వాళ్ల కోరిక ఏంటో తెలిసిపోతోందని థరూర్ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు