ఐదు గదులు... ప్రత్యేక కిచెన్‌

21 Jan, 2019 04:01 IST|Sakshi

శశికళకు జైల్లో ప్రత్యేక మర్యాదలు నిజమే

తేల్చిన విచారణ కమిటీ

బెంగళూరు: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న అన్నా డీఎంకే మాజీ నాయకురాలు శశికళకు జైలులో ప్రత్యేక మర్యాదలు, సౌకర్యాలు కల్పించారని విచారణ కమిటీ తేల్చింది. ఆర్టీఐ కార్యకర్త నరసింహ మూర్తి దాఖలుచేసిన అర్జీకి ఈ మేరకు సమాధానం లభించింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శశికళకు ప్రత్యేక కిచెన్‌తో పాటు, ఐదు గదులు కల్పించారని అప్పటి డీఐజీ(జైళ్లు) డి. రూప ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు నిజమేనని విచారణ జరిపిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వినయ్‌ కుమార్‌ కమిటీ నివేదిక ధ్రువీకరించింది. ఆర్టీఐ అర్జీ ద్వారా ఆ కమిటీ నివేదికను సంపాదించానని, శశికళకు ప్రత్యేక మర్యాదలు జరిగిన సంగతి నిజమేనని దీని ద్వారా తెలుస్తోందని నరసింహ మూర్తి చెప్పారు.

కాగా ఈ పరిమాణంపై రూప స్పందిస్తూ..తాను ఆనాడు చెప్పిన విషయాల్నే విచారణ కమిటీ ధ్రువీకరించిందని పేర్కొన్నారు. వినయ్‌ కుమార్‌ తన నివేదికను 2017లో ప్రభుత్వానికి సమర్పించారు. జైలులో శశికళ తనకు నచ్చిన దుస్తులు ధరించి వంట చేసుకునేవారని, ఆమె సెల్‌లో సుగంధ ద్రవ్యాలు లభించాయని ఆ నివేదిక పేర్కొంది. జైలులో ఆమె స్వేచ్ఛగా సంచరించేవారని, తన సహచరిణి ఇళవరసితో కలసి బయటికి వెళ్తున్నట్లు వీడియోలో కనిపించిందని తెలిపింది. 2017 జూన్‌ 11న తెలుపు రంగు చొక్కా, ప్యాంటు ధరించిన ఓ వ్యక్తితో శశికళ సుమారు నాలుగు గంటలు మాట్లాడినట్లు పేర్కొంది. కానీ, ఆ వ్యక్తితో శశికళ 45 నిమిషాలే మాట్లాడినట్లు రిజిస్టర్‌లో నమోదైంది.

మరిన్ని వార్తలు