సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే మాజీ నేత శశికళ భర్త నటరాజన్(73) కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 1.30కి ఆయన తుదిశ్వాస విడిచారు. చెన్నై బీసెంట్ నగర్లోని నివాసానికి నటరాజన్ భౌతికకాయంను తరలించారు. అయితే జైలులో ఉన్న శశికళకు పెరోల్ మంజూరు కానుంది. ఈ రోజు ఉదయం 11 గంటల వరకు భౌతికాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. మూడు రోజుల కింద నటరాజన్ గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే నటరాజన్ గతంలో కూడా లివర్ సంబంధిత వ్యాధితో అస్వస్థతకు గురయ్యారు.
గతంలో నటరాజన్ ప్రజా సంబంధాల అధికారిగా పనిచేశారు. విద్యార్థి దశ నుంచే డీఎంకేలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. 1975లో నటరాజన్ శశికళను వివాహం చేసుకున్నారు.