‘ఆ పిల్లలే రేపు ఉగ్రవాదులుగా మారుతున్నారు’

3 Aug, 2019 10:43 IST|Sakshi

శ్రీనగర్‌: కశ్మీర్‌ యువత ఉగ్రవాదులుగా మారకుండా వారి తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలని భారత ఆర్మీ అధికారులు సూచించారు. కశ్మీర్‌ లోయలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జనరల్‌ దిలాన్‌ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. పిల్లల్ని ఉద్రవాదం వైపు అడుగులు వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. సమావేశంలో దిలాన్‌ మాట్లాడుతూ.. ‘‘భద్రతా సిబ్బందిపై అవేశంతో ఇక్కడి యువత ఉగ్రవాదుల మాటలు విని నేడు రూ. 500కు రాళ్లు విసురుతున్నారు. కానీ రేపు వారే తిరిగి ఉద్రవాదులుగా మారుతున్నారు. ఈరోజు కశ్మీర్‌లో ఉన్న 80శాతం ఉగ్రవాదులు ఒకప్పుడు డబ్బులకు ఆశపడి రాళ్లు రువ్వినవారే. వారిలో చాలామంది భద్రతాదళాల కాల్పుల్లో మరణించారు. తల్లిదండ్రుల పిల్లల రక్షణ బాధ్యత, పెంపకం కూడా చూసుకోవాలి. ఇక్కడి యువతను తప్పుదోవ పట్టించే విధంగా పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రముఠా కుట్రలు చేస్తోంది’ అని అన్నారు.

కాగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్‌నాథ్‌ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో లోయలో పరిస్థితిని ఆర్మీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భారీ ఎత్తున బలగాలను తరలించి.. కశ్మీర్‌  లోయను పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. అలాగే రాజకీయ నాయకుల నుంచి కూడా పూర్తి సహకారం కోసం కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ అక్కడి నేతలతో భేటీ అయ్యారు. పరిస్థితిని వారికి వివరించి.. బలగాలకు సహరించాలని ఆయన కోరారు. 

>
మరిన్ని వార్తలు