శ్రీనగర్ : జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 14 పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్ధానం కేంద్రానికి రెండు నోటీసులు జారీ చేసింది. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన అన్ని పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ అక్టోబర్ నుంచి విచారిస్తుందని స్పష్టం చేసింది. మరోవైపు కశ్మీర్లో మీడియాపై నియంత్రణలకు సంబంధించి కేంద్రం బదులివ్వాలని కోరుతూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లోగా దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని కోరింది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ జారీ చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేస్తే అది అంతర్జాతీయ ప్రభావాలకు దారితీస్తుందని ప్రభుత్వం వాదించింది. ఇక దేశంలోకి పౌరులు ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛను హరించడం తగదని తన సహచరుడిని కలిసేందుకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని శ్రీనగర్ వెళ్లేందుకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్లో గవర్నర్ పాలన సక్రమంగా లేదని అడ్వకేట్ గోపాల్ శంకర్నారాయణన్ కోర్టుకు నివేదించారు. కశ్మీర్లో గవర్నర్ పాలన గడువు పొడిగిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల గడువు జూన్తో ముగిసిందని, తాజా ఉత్తర్వులు జారీ చేసే సమయానికి గవర్నర్ పాలన అమల్లో లేనందున ఆర్టికల్ 370 రద్దుకు చట్టబద్ధత లేదని ఆయన వాదించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ స్పందిస్తూ ఈ అంశం ఐదుగురు న్యాయమూర్తు ధర్మాసనం అక్టోబర్ నుంచి విచారణ చేపడుతుందని బదులిచ్చారు.