‘ఛస్‌.. ఇది సుప్రీం కోర్టా? చేపల మార్కెటా?’

6 Feb, 2018 08:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జస్టిస్‌ లోయా మృతి కేసులో వాదిస్తున్న న్యాయవాదులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాదనలు కొనసాగుతున్న సమయంలో ఒక దశలో పరుష పదజాలంతో ఇద్దరు దూషించుకున్నారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి వీవై చంద్రచూడ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

‘‘కోర్టు మర్యాదను కాపాడండి. మీ వాగ్వాదంతో న్యాయస్థానాన్ని చేపల మార్కెట్‌గా మార్చకండి. మీరు వాదించేది చాలా సున్నితమైన అంశం. ఒక న్యాయమూర్తి మృతికి సంబంధించిన కేసు. ఇక్కడ మాజీ న్యాయమూర్తుల చిత్రపటాలు ఉన్నాయి. కనీసం వారికైనా గౌరవం ఇచ్చి కోర్టు హాలులో కాస్త పద్ధతిగా మెలగండి’’ అంటూ జస్టిస్‌ చంద్రచూడ్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సీబీఐ న్యాయమూర్తి బ్రిజ్‌గోపాల్‌ హర్‌కిషన్‌ లోయా మృతిలో అనుమానాలు ఉన్నాయంటూ కార్వాన్‌ మాగ్జైన్‌(లోయా సోదరి అనురాధా బియానీ ఇచ్చిన ఇంటర్వ్యూ), ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ కథనాల ఆధారంగా ‘బీహెచ్‌ లోనే’ అనే జర్నలిస్ట్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. లోనే తరపున అడ్వొకేట్‌ పల్లవ్‌ సిసోడియా.. ముంబై లాయర్స్‌ అసోషియన్‌ తరపున దుష్యంత్‌ దవే వాదిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం విచారణ సందర్భంగా ఇరు వర్గాల న్యాయమూర్తులు దూషించుకున్నారు. 

లోయా మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని.. దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే స్వతంత్ర్య విభాగాన్ని ఏర్పాటు చేయాలని సిసోడియా వాదించారు. దీనికి స్పందిన దవే.. గతంలో ఇదే అంశంపై బాంబే హైకోర్టు పిటిషన్‌ కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో ఆగ్రహాం వ్యక్తం చేసిన సిసోడియా ‘నువ్వు ఎలా చచ్చినా నాకు పర్వాలేదు’’ అంటూ దవేను ఉద్దేశించి వ్యాఖ్యానించగా.. దవే కూడా మాటల యుద్ధానికి దిగారు.

ఈ నేపథ్యంలోనే జస్టిస్‌ చంద్రచూడ్‌ జోక్యం చేసుకుని ఇరు వర్గాలను వారించాల్సి వచ్చింది. అయినప్పటికీ దవే వెనక్కి తగ్గకపోవటంతో సున్నితంగా వారించిన న్యాయమూర్తి కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు