కరోనా: ‘అధిక ఫీజులపై సమాధానం ఇవ్వండి’

5 Jun, 2020 12:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా రోగుల చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేయాల్సిన ఫీజుకు పరిమితి విధింపుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, అందువల్ల చాలా మంది బాధితులకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేక, వాటి సేవలు అందుబాటులో లేవని పిటిషనర్ అవిషేక్ గోయెంకా కోర్టుకు తెలిపారు. కోవిడ్ రోగుల చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులు వసూలు చేస్తున్న ఫీజుపై అధిక పరిమితిని విధించడంపై జస్టిస్ అశోక్ భూషణ్, ఎంఆర్ షా, వి.రామసుబ్రమణియన్ ధర్మాసనం కేంద్రం స్పందనను కోరింది. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలాఉండగా, కోవిడ్ రోగుల చికిత్సపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గతంలో విచారించింది. ‘ప్రభుత్వం నుంచి ఉచితంగా భూమిని పొందిన ప్రైవేట్, ఛారిటబుల్ ఆస్పత్రులను కోవిడ్ రోగులకు ఉచితంగా చికిత్స చేయమని కోరవచ్చా’ అని గతంలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. అయితే, కోవిడ్ రోగులకు ఉచితంగా చికిత్స అందించడానికి ప్రైవేట్ ఆస్పత్రులను ఆదేశించే చట్టబద్ధమైన అధికారం తమకు లేదని ఇప్పటికే కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.
(చదవండి: వైరల్‌: మెడపై కాలేసి తొక్కిపట్టిన పోలీసు!)

మరిన్ని వార్తలు