రఫేల్‌ రివ్యూ పిటిషన్లపై రేపు సుప్రీం తీర్పు..

13 Nov, 2019 15:38 IST|Sakshi

న్యూఢిల్లీ : రఫేల్‌ ఒప్పందానికి క్లీన్‌ చిట్‌ ఇస్తూ సర్వోన్నత న్యాయస్దానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌లతో కూడిన సుప్రీం బెంచ్‌ తీర్పును వెల్లడిస్తుంది. గత ఏడాది డిసెంబర్‌ 14న రఫేల్‌ ఒప్పందంపై ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌లపై మే 10న అన్ని పక్షాల వాదనలు విన్న మీదట సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.

బీజేపీ మాజీ నేతలు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరి, సామాజిక కార్యకర్త ప్రశాంత్‌ భూషణ్‌లు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఫ్రెంచ్‌ కంపెనీ దసాల్ట్‌ ఏవియేషన్‌ల మధ్య కుదిరిన రఫేల్‌ ఒప్పందంపై విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌లను సుప్రీం కోర్టు గతంలో కొట్టివేసిన సంగతి తెలిసిందే. రఫేల్‌ యుద్ధ విమానాల ధరలు, ఇతర వివరాలతో కూడిన పత్రాలను సుప్రీం కోర్టు పరిశీలించిన మీదట ఈ ఒప్పందానికి సర్వోన్నత న్యాయస్ధానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కాగా రఫేల్‌ ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని అప్పటి కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సహా విపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు