‘డీజీపీ నియామకాలపై యూపీఎస్‌సీని ఆశ్రయించాల్సిందే’

16 Jan, 2019 15:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : డీజీపీ ఎంపిక, నియామకాలపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని ఐదు రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లను బుధవారం సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. డీజీపీల ఎంపిక, నియామకాలపై తమ స్ధానిక చట్టాలకు అనుగుణంగా వ్యవహరించే వెసులుబాటు కోరుతూ పంజాబ్‌, కేరళ, పశ్చిమ బెంగాల్‌, హర్యానా, బిహార్‌ తదితర రాష్ట్రాల అప్పీల్‌ను విచారిస్తూ సుప్రీం కోర్టు గతంలో న్యాయస్ధానం జారీ చేసిన ఉత్తర్వులను సమర్ధించింది.

డీజీపీ నియామకానికి రాష్ట్రాలు యూపీఎస్‌సీని ఆశ్రయించాల్సిందేనని స్పష్టం చేసింది.డీజీపీల ఎంపిక, నియామకంపై విస్తృత ప్రయోజనాలతో పాటు రాజకీయ జోక్యం నుంచి పోలీస్‌ అధికారులను కాపాడేందుకు కోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ స్పష్టం చేసింది. డీజీపీల నియామకానికి అనుసరించాల్సిన ప్రక్రియపై గత ఏడాది జులై 3న సుప్రీం కోర్టు పలు ఆదేశాలను జారీ చేసింది.

మరిన్ని వార్తలు