ఆ ఈఎంఐలపై వడ్డీ భారం తగదన్న పిటిషనర్‌

4 Jun, 2020 14:18 IST|Sakshi

వడ్డీపై వడ్డీ వసూలు చేస్తారా!

సాక్షి, న్యూఢిల్లీ : మారటోరియం సమయంలో ఈఎంఐలపై వడ్డీ భారంపై బదులివ్వాలని సర్వోన్నత న్యాయస్ధానం గురువారం ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది. మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆర్‌బీఐతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఇక మారటోరియం సమయంలో​ రుణ వాయిదాలపై వడ్డీ రద్దుతో బ్యాంకుల ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని, డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం ఏర్పడుతుందని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఆర్‌బీఐ పేర్కొంది.

ఈ వ్యవహారంలో రెండు అంశాలను పరిశీలిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంటూ మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయకపోవడం,వడ్డీపై వడ్డీ విధించకపోవడం పరిశీలించాలని కోరింది. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో ఇది తీవ్రంగా చర్చించాల్సిన అంశమని..ఓ వైపు మారటోరియం వెసులుబాటు ఇస్తూనే మరోవైపు పేరుకుపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేస్తున్నారని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన సర్వోన్నత న్యాయస్ధానం వ్యాఖ్యానించింది. చదవండి : 'భార‌త్'‌గా ఇండియా: కేంద్రాన్ని ఆశ్ర‌యించండి

ఈ అంశంపై సుప్రీంకోర్టులో తీవ్ర వాదోపవాదాలు సాగాయి. మహమ్మారి వైరస్‌తో ఆర్థికంగా చితికిపోయిన ప్రజలకు మారటోరియం వెసులుబాటు ఇచ్చినా వడ్డీ భారం మోపడం సరైంది కాదని పిటిషనర్‌ గజేంద్ర శర్మ తన పిటిషన్‌లో వాపోయారు. మరోవైపు ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలుకు కొంత సమయం కావాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోరారు.

>
మరిన్ని వార్తలు