ఆధార్‌ లేదని ప్రవేశాలు నిరాకరించొద్దు

6 Sep, 2018 02:22 IST|Sakshi

పాఠశాలలకు ఉడాయ్‌ ఆదేశాలు

ఆధార్‌ నమోదు, అప్‌డేట్‌కు శిబిరాలు నిర్వహించాలి

న్యూఢిల్లీ: ఆధార్‌ లేదన్న కారణంతో విద్యార్థులకు పాఠశాలల ప్రవేశాలను నిరాకరించరాదని ఆధార్‌ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు చట్ట ప్రకారం ఆమోదయోగ్యం కావని పేర్కొంది. ఆధార్‌ లేనందుకు కొన్ని పాఠశాలలు విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంలేదన్న ఆరోపణలు తన దృష్టికి రావడంతో యూఐడీఏఐ స్పందించింది. విద్యార్థులకు అందాల్సిన ప్రయోజనాలు, హక్కులను ఆధార్‌ను కారణంగా చూపుతూ దూరం చేయకూడదని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది.

ఇప్పటి వరకూ ఆధార్‌ పొందని, బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోని విద్యార్థుల కోసం ప్రత్యేక శిబిరాల ను నిర్వహించే బాధ్యత సంబంధిత పాఠశాలలదే అని స్పష్టం చేసింది. స్థానిక బ్యాంకులు, పోస్టాఫీసులు, జిల్లా అధికారులు, రాష్ట్ర విద్యా శాఖ సమన్వయంతో పాఠశాలలే అలాంటి విద్యార్థుల కోసం ఆధార్‌ నమోదు, అప్‌డేట్‌ శిబిరాలు నిర్వహించాలని సూచించింది. ఏటా కనీసం రెండు సార్లు అన్ని పాఠశాల్లో ఆధార్‌ నమోదు కేంద్రాలను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.విద్యార్థులు ఆధార్‌ పొందే వరకు, బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకునే వరకు ప్రత్యామ్నాయ గుర్తిం పు మార్గాలను అనుమతించాలంది. 5–15 ఏళ్లు నిండిన చిన్నారుల ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేయడం తప్పనిసరని పేర్కొంది.

మరిన్ని వార్తలు