శివుడికి సీటు కేటాయించిన రైల్వే అధికారులు

17 Feb, 2020 20:01 IST|Sakshi

కాశీ మహాల్‌ ఎక్స్‌ప్రెస్‌ శివుడికి సీటు రిజర్వ్‌

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన కాశీ మహాల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా రాజకీయ నేతలు, ప్రముఖుల కోటాలో రైలు టికెట్లను కేటాయిస్తారు. కానీ కాశీ మహాల్ ఎక్స్‌ప్రెస్ రైలులో మాత్రం ఏకంగా దేవుడికే ఓ సీటును రిజర్వు చేశారు. అంతేకాదు శివుడి పేరుతో ప్రత్యేక బెర్త్ కూడా ఏర్పాటు చేశారు. బి5 కోచ్‌లోని సీట్ నెంబర్ 64 పూర్తిగా దేవుడికే కేటాయించారు. అంతటితో ఆగిపోకుండా అందులో శివుడి చిత్రపటాన్ని పెట్టి  సీటును పూలతో డెకరేట్ చేశారు. ప్రయాణికులు ఎవ్వరు ఈ సీట్ పైకి ఎక్కకూడదు అంటూ బోర్డు పెట్టారు. రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినప్పటికీ దీన్ని ఎంత కాలం వరకు దేవుడి పేరుతో కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలిసి ప్రయాణికులంతా ఆశ్చర్యపోతున్నారు.

ప్రధాని మోదీ చేతుల మీదుగా యూపీలో కాశీ మహాల్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆదివారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైలు ఇండోర్ నుంచి కాశీకి ప్రతి రోజూ రాకపోకలను జరుపుతుంది. మార్గంలో మధ్యలోని మూడు జోతిర్లాంగాల క్షేత్రాలైన.. ఓంకారేశ్వర్, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్‌ని చుట్టుకుంటూ కాశీని చేరుకుంటుంది. సుమారు 1131 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ మూడు జోతిర్లాంగాల క్షేత్రాలను చుట్టేస్తుంది.  ప్రతి కోచ్ లో భక్తి సంగీతం చిన్నగా వినిపిస్తూ ఉంటుంది. ప్రయాణికులకు పూర్తి భక్తి భావం కలిగేలా ఇలాంటి సదుపాయం ఏర్పాటు చేశారు. దీంతో పాటు శాకాహార భోజనం కూడా అందించే ఏర్పాట్లు చేశారు. కాగా భారతీయ రైల్వే కాకుండా పూర్తిగా ‍ ప్రైవేటు సంస్థ తయారు చేసిన మూడో రైలు కాశీ మహాల్‌ ఎక్స్‌ ప్రెస్‌ కావడం విశేషం.

 

మరిన్ని వార్తలు