పార్లమెంట్‌ ఎగ్జిట్‌ గేట్‌ నుంచి దూసుకొచ్చిన కారు

12 Feb, 2019 14:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కట్టుదిట్టమైన భద్రత, అనుక్షణం పోలీసు పహారాలో ఉండే పార్లమెంట్‌ ఎగ్జిట్‌ గేట్‌ నుంచి ఓ వాహనం లోపలికి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారుల కళ్లుగప్పి నిష్క్రమణ ద్వారం నుంచి బారికేడ్‌ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన కారును అడ్డుకున్న భద్రతాధికారులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. రాంగ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ కారు నెంబర్‌ డీఎల్‌ 12 సీహెచ్‌ 4897 కాగా, ఈ వాహనంపై ఎంపీ స్టిక్కర్‌ ఉంది. ఈ కారు ఇన్నర్‌ మణిపూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ లోక్‌సభ ఎంపీ డాక్టర్‌ తొకొం మైనాకు చెందినదిగా అధికారులు గుర్తించారు.

కాగా, కారు ఎగ్జిట్‌ గేట్‌ ద్వారా లోపలికి రావడంతో భద్రతా లోపాలపై పార్లమెంట్‌ భద్రతా సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. పార్లమెంట్‌ ప్రాంగణం పరిసరాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. ఈ ఘటన 2001 డిసెంబర్‌13న పార్లమెంట్‌పై జైషే, లష్కరే ఉగ్రవాదుల దాడి ఘటనను జ్ఞప్తికి తెచ్చింది. నాటి ఘటనలో ఐదుగురు ఢిల్లీ పోలీసులు సహా తొమ్మిది మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు పార్లమెంట్‌ సిబ్బంది, గార్డెనర్‌తో పాటు ఓ జర్నలిస్ట్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు