వాళ్లంతా అరవైలో ఇరవై

19 Sep, 2018 05:43 IST|Sakshi
ఉధవి సంస్థ సభ్యులు

సాటి పండుటాకులకు సాయపడుతున్న సీనియర్‌ సిటిజన్లు

చెన్నై ఉధవి సంస్థలో వాలంటీర్లూ వృద్ధులే

కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులేమో కానీ, ఆ వృద్ధుల్లో  మాత్రం వయసు మీదపడినా ఉత్సాహమే ఉత్సాహం. కాటికి కాళ్లు చాపుకునే వయసులో కృష్ణా రామా అంటూ మూల కూర్చోవడం వాళ్ల పని కాదు. జీవిత చరమాంకంలో ఏం చెయ్యాలి, సమయాన్ని ఎలా గడపాలి అంటూ కుంగిపోయే జీవితం వాళ్లది కానే కాదు. సాటి పండుటాకుల్లో మనోస్థైర్యాన్ని నింపడమే వారి పని. అదే వాళ్లకు కొండంత బలం.

అది చెన్నైకి చెందిన ఉధవి అనే స్వచ్ఛంద సంస్థ. వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధపడే వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో  అయిదేళ్ల క్రితమే మొదలైంది. ఈ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే అక్కడ వాలంటీర్లు అందరూ కూడా డెబ్బయి ఏళ్ల పైబడిన వారే. వృద్ధులైతేనే సాటి వారి కష్టాలు అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో సీనియర్‌ సిటిజన్లనే వాలంటీర్లుగా నియమించింది. ఇప్పుడు వారే ఒక సైన్యంగా మారారు. తమని తాము ఉత్తేజంగా ఉంచడమే కాదు, ఆపదలో ఉన్న తోటివారికి అండదండగా ఉంటున్నారు. సూపర్‌ హీరోయిన్లుగా గుర్తింపు పొందారు.

అటు నుంచి ఫోన్‌ కాల్‌ ఒకటి వస్తుంది. సన్నటి ఏడుపు, బాధిస్తున్న ఒంటరితనం, ఏం చెయ్యాలో సమయాన్ని ఎలా గడపాలో తెలీని నిస్సహాయత, ఒక్కోసారి ఆత్మహత్యవైపు ప్రేరేపించే ఆలోచనలు. కాటికి కాళ్లు చాపుకునే వయసులో అయినవాళ్లు పట్టించుకోకపోతే ఆ బాధ అంతా ఇంతా కాదు. ఆ బాధ పంచుకోవడానికి ఒకరు కావాలి. అలాంటి ఫోన్‌ రాగానే 76 ఏళ్ల వయసున్న సుందర గోపాలన్‌ అనే వాలంటీర్‌ రెక్కలు కట్టుకొని ఆ బాధితుల దగ్గరకి వెళ్లిపోతారు.  వాళ్లతో కబుర్లు చెబుతారు. జోకులు వేస్తారు. నవ్విస్తారు. కాసేపు అలా పార్కుకి తీసుకెళ్లి చల్లగాలిలో కలిసి వాకింగ్‌ చేస్తారు. డెబ్బయి ఆరేళ్ల వయసులో కూడా తాను ఎంత హాయిగా ఉన్నానో వాళ్లకి చెబుతారు. అలా ఏదో ఒక్కసారి కాదు. వారంలో రెండు, మూడు సార్లు వాళ్ల దగ్గరికి వెళ్లి వస్తుంటారు.  అలా నెల రోజుల పాటు ఆ బాధితులతో టచ్‌లో ఉంటారు.  మళ్లీ వారి ముఖం మీద చిరునవ్వు వచ్చేవరకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. ‘ఒంటరితనం మనిషిని చంపేస్తుంది. నా భర్త చనిపోయినప్పుడు అదెంత బా«ధిస్తుందో నాకు తెలిసివచ్చింది.. అలాంటి బాధలో ఉన్నవారిని ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు. జీవితం ముందుకు వెళ్లేలా వారికి అన్ని విధాలుగా సాయపడగలను‘ అని సుందర గోపాలన్‌ వివరించారు.

వేదవల్లి శ్రీనివాస గోపాలన్‌. ఆమె వయసు 85. ఈ వయసులో కూడా స్వెట్టర్లు అల్లుతారు. హ్యాండ్‌బ్యాగ్స్‌ తయారు చేస్తారు. వాటిని ఇరుగుపొరుగు వాళ్లకి, స్నేహితులకి అమ్మి ఆ వచ్చిన డబ్బుని కష్టాల్లో ఉన్న వృద్ధులకి ఇస్తూ ఉంటారు. ‘ మా అమ్మ ఎప్పుడు చూసినా అదే పనిలో ఉంటుంది. తనని తాను కష్టపెట్టుకుంటుంది. ఆ పని వద్దన్నా వినిపించుకోదు. ఎంత ఎక్కువ మందికి సాయపడితే తనకు అంత తృప్తి అంటుంది. కానీ మాకు ఆమె ఆరోగ్యం ఏమైపోతుందోనన్న ఆందోళన ఉంటుంది‘ అని వేదవల్లి కుమార్తె కృష్ణవేణి చెప్పుకొచ్చారు.

ఉధవి సంస్థ వ్యవస్థాపకురాలు సబితా రాధాకృష్ణన్, ఆమె వయసు 75 ఏళ్లు. అయినవాళ్లు ఎవరూ లేక ఒంటరితనంతో బాధపడే వృద్ధుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపడం కోసమే ఆమె ఈ సంస్థ స్థాపించారు.  చిన్న చిన్న అవసరాలైనా నేనున్నానంటూ తీరుస్తారు. గుళ్లు గోపురాలు తిప్పడం,  షాపింగ్‌కు తోడు వెళ్లడం, రెస్టారెంట్లకి తీసుకువెళ్లడం, బ్యాంకు పనుల్లో సాయ పడడం వంటివి చేస్తూ ఉంటారు. ‘సీనియర్‌ సిటిజన్ల దైనిందిన కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వారి ఒంటరితనాన్ని పోగొట్టడమే మా సంస్థ ప్రధాన ఉద్దేశం. వాలంటీర్లు అదే వయసు వారు ఉంటే  వారి మధ్య వేవ్‌ లెంగ్త్‌ బాగా ఉంటుందని సీనియర్‌సిటిజన్లనే వాలంటరీర్లుగా నియమిస్తున్నాం‘ అని సబిత వెల్లడించారు. అంతేకాదు సీనియర్‌ సిటిజన్లు నిరంతరం పనిలో ఉంటేనే వారిలో మానసిక, శారీరక ఆరోగ్యం బాగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.  వాలంటీర్‌గా పని చేస్తున్న వృద్ధుల్లో చలాకీతనం బాగా పెరిగిందని సబిత చెప్పారు.

ఇలాంటి సంస్థల అవసరం ఉంది
మన దేశంలో సీనియర్‌ సిటిజన్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో వారి సంఖ్య పెరిగిపోతోంది. మన దేశంలో 60ఏళ్లపై బడినవారు 13 కోట్ల మంది ఉన్నారు. వారిలో 63శాతం మంది దారిద్య్ర రేఖకి దిగువన నివసిస్తున్నారు. అనారోగ్యంతో మంచానపడితే చూసే దిక్కులేనివారు  62% , ఇక కుటుంబ సభ్యుల నిర్లక్ష్యానికి గురవుతున్న వృద్ధులు 54%.  మరో ఎనిమిదేళ్లలో దేశంలో వృద్ధుల సంఖ్య 17.3 కోట్లకు చేరుకోవచ్చు. ఇక 2050 నాటికి జనాభాలో 20 శాతం మంది వృద్ధులే ఉంటారని యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్, హెల్పేజ్‌ ఇండియా సంస్థలు అంచనా వేశాయి. వృద్ధుల సంక్షేమం కోసమే ఐక్యరాజ్యసమితి అక్టోబర్‌ 1వ తేదీని ఇంటర్నేషనల్‌ డే ఫర్‌ ఓల్డర్‌ పర్సన్స్‌గా ప్రకటించింది. నానాటికి పెరిగిపోతున్న వృద్ధుల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన సంస్థల అవసరమూ భవిష్యత్‌లో పెరుగుతుంది. అందుకే ఉధవి సంస్థ చేస్తున్న సేవల్ని అందరూ భేష్‌ అంటూ కొనియాడుతున్నారు.

కాలక్షేపంలో వృద్ధులు

మరిన్ని వార్తలు