ముజఫర్‌పూర్‌ ఘటనలో వైద్యుడి సస్పెండ్‌

23 Jun, 2019 11:47 IST|Sakshi

పాట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో (ఎస్‌కెఎంసిహెచ్) చేరిన 109 మంది పిల్లలు మరణించిన సంగతి తెలిసిందే. మెదడువాపు వ్యాధితో ఆస్పత్రిలో చేరిన వీరికి సరైన చికిత్స అందించకుండా పిల్లల మరణాలకు కారణమైన సీనియర్ రెసిడెంట్ డాక్టర్ భీమ్‌సేన్‌ కుమార్‌ను సస్పెండ్ చేశారు. తాజాగా అక్కడి పరిస్థితుల మీద అధ్యయనం  చేయడానికి  వైద్యారోగ్య శాఖ జూన్ 19న పట్నా మెడికల్ కాలేజీకి చెందిన పిల్లల వైద్యుడిని నియమించింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మెదడువాపు వ్యాధి వల్ల 145 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడంపై నితీశ్‌కుమార్‌ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 

ఈ ఘటనపై ముంబైకి చెందిన వాలంటీర్‌ డాక్టర్‌ రవికాంత్‌ సింగ్‌ మాట్లాడుతూ.. 'బిహార్‌లో ఉన్న పేదరికం కారణంగా ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. పోషకాహారలేమి, సరైన వైద్య సదుపాయం, పరిశుభ్రత లేకపోవడం వల్ల డాక్టర్లు వ్యాధులను నయం చేయలేకపోతున్నారు' అని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మార్పు, వ్యాధులపై అవగాహన  రానిదే తామేమీ చేయలేమని కేజ్రీవాల్‌ ఆసుపత్రి ట్రస్ట్‌ నిర్వాహక కార్యదర్శి రాజ్‌కుమార్‌ గోయెంకా పేర్కొన్నారు. అయితే కేజ్రీవాల్ ఆసుపత్రిలోనూ మరో 20 మంది పిల్లలు ఇదే వ్యాధితో మరణించినట్లు తెలిసింది. అధికారికంగా 145 మంది పిల్లలు మరణించినట్లుగా లెక్కలు చూపిస్తున్నా.. అనధికారికంగా 180మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

మరిన్ని వార్తలు