సీనియర్‌ జర్నలిస్ట్‌ దారుణ హత్య!

24 Sep, 2017 02:31 IST|Sakshi

మొహాలి: ఇటీవల బెంగళూరులో సీనియర్‌ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్, త్రిపురలో శాంతను భౌమిక్‌ల దారుణ హత్యల్ని మరువకముందే పంజాబ్‌లో మరో సీనియర్‌ జర్నలిస్ట్‌ శనివారం అనుమానాస్పదంగా మృతిచెందారు. మొహాలిలోని ఫేజ్‌3 బీ2 ఇంట్లో నివాసముంటున్న సీనియర్‌ జర్నలిస్ట్‌ కేజే సింగ్‌(64), ఆయన తల్లి గురుశరణ్‌ కౌర్‌(92)లు తమ గదుల్లో విగతజీవులై కన్పించారు. సింగ్‌ గొంతు కోసి కత్తితో పొడిచిన దుండగులు, ఆయన తల్లి గొంతు నులిమి హతమార్చి ఉంటారని ముఖ్యమంత్రి కార్యాలయం అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు.

సింగ్‌ను కలుసుకునేందుకు ఆయన చెల్లి యశ్‌పాల్‌ కౌర్‌ మేనల్లుడు అజయ్‌ పాల్‌లు శనివారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట మధ్యలో ఇంటికి రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చిందన్నారు. సింగ్‌ ఇంటికి ఎలాంటి సీసీటీవీలు బిగించుకోలేదనీ, ఆయన కారు కూడా కనిపించడం లేదని వెల్లడించా రు. పంజాబ్‌ సీఎం అమరీందర్‌ ఆదేశాలతో దుండగుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌)  ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సిట్‌కు ఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారని తెలిపారు. వీరిద్దరిని హత్యచేసిన దుండగులు.. సింగ్‌ మెడలోని బంగారు గొలుసును, ఆయన తల్లి గదిలో ఉన్న రూ.25 వేల నగదును ముట్టుకోలేదన్నారు. ఇది దోపిడీ ఘటనలా కన్పించినప్పటికీ అసలు కారణం వేరే ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు