సీనియ‌ర్ అధికారికి కోవిడ్..పెద్ద సంఖ్య‌లో ఉద్యోగులు క్వారంటైన్

18 May, 2020 08:58 IST|Sakshi

న్యూఢిల్లీ : రాష్ట్రపతి భ‌వ‌న్‌లో సీనియ‌ర్ పోలీస్ అధికారికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో  వెంట‌నే ఆయ‌న‌ను ఢిల్లీ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.  దీంతో భ‌వ‌న్‌లో ప‌నిచేస్తున్న అనేక మంది పోలీసులు, ఇత‌ర సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంచిన‌ట్లు అధికారిక వ‌ర్గాల స‌మాచారం. గత నెల‌లో ఓ ఉద్యోగికి క‌రోనా పాజిటివ్ అని నిర్థార‌ణ కావ‌డంతో దాదాపు 115 కుటుంబాల‌ను ఐసోలేష‌న్‌లో ఉంచిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న‌కు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌టంతో ఏప్రిల్ 13న ఢిల్లీలోని బిఎల్ కపూర్ ఆసుపత్రిలో క‌న్నుమూసిన‌ట్లు సీనియ‌ర్ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు.  ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల్లో ఒక‌రికి పాజిటివ్ రాగా, మిగిలిన ఆరుగురికి నెగిటివ్ అని తేలింది. (కరోనా పోరు: మాస్కులు కుట్టిన రాష్ట్రపతి సతీమణి )

ఇక క‌రోనాపై పోరుకు త‌న‌వంతు సాయంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  ఇప్ప‌టికే త‌న నెల జీతాన్ని విరాళంగా అంద‌జేయ‌గా, తాజాగా త‌న జీతంలో 30 శాతం డ‌బ్బును ఏడాదిపాటు పీఎం కేర్స్‌ నిధికి విరాళంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంతేకాకుండా క‌రోనా సంక్షోభంలో రాష్ట్రపతి భ‌వ‌న్‌లో  ఖ‌ర్చుల‌ను త‌గ్గించ‌డానికి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. వ‌చ్చే ఏడాది గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్రపతి వినియోగం కోసం ప‌ది కోట్ల విలువైన విలాస‌వంత‌మైన లిమోసిస్ కారు కొనుగోలును వాయిదా వేశారు. అలాగే విందుల‌కు పెద్ద మొత్తంలో ఖ‌ర్చు చేయ‌రాద‌ని, ప‌రిమిత సంఖ్య‌లో ఆహార‌ప‌దార్థాలను ఉంచాల‌ని నిర్ణ‌యించారు. రాష్ట్రపతి భ‌వ‌న్ ప‌రిస‌రాల్లో పెద్ద ఎత్తున జ‌రిగే పూల అలంక‌ర‌ణ‌లు లాంటి డెక‌రేష‌న్ వ‌స్తువుల‌ను ప‌రిమితం చేయాల‌ని ఓ ప్ర‌క‌ట‌న విడుదల చేశారు. (ఖర్చు ఆదా చేసే పనిలో రాష్ట్రపతి భవన్ )


   

మరిన్ని వార్తలు