‘24 గంటలు..ఏడు ఎన్‌కౌంటర్లు’

28 Jul, 2019 12:10 IST|Sakshi

లక్నో : యూపీలో గడిచిన 24 గంటల్లో పోలీసులు పలు ప్రాంతాల్లో ఏడు ఎన్‌కౌంటర్లను చేపట్టారు. రాయ్‌బరేలి, ఘజియాబాద్‌, మొరదాబాద్‌ సహా పలు నగరాల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్లలో ఏడుగురు క్రిమినల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఏడు ఎన్‌కౌంటర్లలో మూడు ఎన్‌కౌంటర్లు ఘజియాబాద్‌లోనే చోటుచేసుకోవడం గమనార్హం. పోలీసు చర్యలో భాగంగా ఒక్కొక్కరి తలపై రూ 25,000 వరకూ రివార్డు ఉన్న ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. పట్టణంలోని కవినగర్, మోదీ నగర్‌, విజయ్‌ నగర్‌ ప్రాంతాల్లో ఈ ఎన్‌కౌంటర్లు జరిగాయి.

ఇక హపూర్‌లో బైక్‌పై వెళుతున్న ఇద్దరు నేరస్తులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సీఆర్‌పీఎఫ్‌ యూనిఫాం ధరించిన నేరస్తుడికి గాయాలు కాగా, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. మొరాదాబాద్‌లో ఓ నేరస్తుడు పోలీసులకు పట్టుబడగా మరో నిందితుడు పరారయ్యాడు. రాయ్‌బరేలిలో తలపై రూ 25,000 వెల పలికిన నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల్లో ఓ పోలీస్‌కు గాయాలయ్యాయి.

మరిన్ని వార్తలు