‘ఆరు రెట్లు అధిక ధరకు అమ్ముతూ చిక్కారు’

19 Jul, 2020 18:16 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

బ్లాక్‌మార్కెట్‌ దందా

ముంబై : కోవిడ్‌-19 చికిత్సలో ఉపయోగించే రెమ్డిసివిర్‌ ఇంజెక్షన్లను అధిక ధరకు అమ్ముతున్న ఏడుగురు వ్యక్తులను ముంబై పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఈ ఇంజెక్షన్‌ ధర 5400 రూపాయలు కాగా, నిందితులు ఒక్కో ఇంజెక్షన్‌ను ఏకంగా 30,000 రూపాయలకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. నగరంలోని రెండు ప్రాంతాల్లో ఆహార ఔషధ నియంత్రణ అధికారులు (ఎఫ్‌డీఏ), క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు జరిపిన దాడిలో పెద్దసంఖ్యలో రెమ్డిసివిర్‌ ఇంజెక్షన్ల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. రెమ్డిసివిర్‌ ఇంజెక్షన్లను అధిక ధరలకు అమ్ముతున్నారని సమాచారం రావడంతో తొలుత వికాస్‌ దుబె, రాహుల్‌ గడా అనే నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

నిందితులు అందించిన సమాచారంతో డెల్ఫా ఫార్మస్యూటికల్స్‌కు చెందిన మరో ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. వీరిని భవేష్‌ షా, ఆశిష్‌ కనోజియా, రితేష్‌ తాంబ్రే, గుర్వీందర్‌ సింగ్‌, సుధీర్‌ పుజారిలుగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. కాగా రెమ్డిసివిర్‌ ఇంజెక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్న ఏడుగురు వ్యక్తులను హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆసిఫ్‌ నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రాణాధార ఔషధాలను అధిక ధరలకు విక్రయిస్తున్న బ్లాక్‌మార్కెట్‌ వ్యాపారులపై కఠిన చర్యలు చేపట్టాలని ఐసీఎంఆర్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. చదవండి : మూడు గంటలు నడిరోడ్డుపైనే మృతదేహం

మరిన్ని వార్తలు