కాఫీకి రా.. లేకపోతే ఫెయిల్‌ చేస్తా..!

6 Aug, 2018 10:41 IST|Sakshi

ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకుల వేధింపులు

సాక్షి, న్యూఢిల్లీ : భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నత చదువుల కోసం యూనివర్సిటీల్లో అడుగుపెట్టిన విద్యార్థినిలకు వేధింపులు తప్పడం లేదు. దేశంలో అత్యన్నత విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ)లో విద్యార్థినిలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో డీయూలో 28 లైంగిక వేధింపుల కేసులు నమోదైయ్యాయి. ఈ కేసులన్నీ కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్లపై నమోదు కావడం గమన్హారం. విద్యాబుద్దులు నేర్పించి విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చాల్సిన అధ్యాపకులే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యవతి తనపై ప్రొఫెసర్‌ వేధింపులకు పాల్పడున్నారంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో కాఫీకి రాకపోతే పరీక్షల్లో ఫెయిల్‌ చేసి, హాజరుశాతం తగిస్తానంటూ వేధిస్తున్నారని యువతి ఫిర్యాదులో పేర్కొంది. 

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయాల్లో లైంగిక వేధింపులపై చర్యలు తీసుకునేందుకు అంతర్గత ఫిర్యాదులు కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ కమిటీలో ముగ్గురు అధ్యాపకులు, ఓ మహిళ ఫ్రొఫెసర్‌, ముగ్గురు విద్యార్థులు ఉండాలనేది నిబంధన. కానీ అధికారులు అవేవీ పట్టించుకోవట్లేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. కాగా గతంలో కూడా అనేక యూనివర్సిటీల్లో లైంగిక వేధింపుల కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు బాలికలపై అనేక దాడులు జరుగుతున్నాయని, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధ్యాపకులను తీవ్రంగా శిక్షించాలని విద్యార్ధినులు డిమాండ్‌ చేస్తున్నారు.


 

మరిన్ని వార్తలు